ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, అక్టోబర్ 5 శనివారం నాడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలుసుకుని, ఆంధ్రప్రదేశ్లో ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై చర్చించనున్నారు. అంతే కాకుండా అక్టోబర్ 15వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న రైతు భరోసా పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అథితిగా రావాల్సిందిగా మోదీని కోరనున్నారు. వీరిద్దరి మధ్య జరగబోయే సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన కీలక సమస్యలు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పిపిఎలు), పోలవరం రివర్స్ టెండరింగ్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం మరియు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, ఇతర ముఖ్యమైన అంశాలు చర్చకు రానున్నాయి. ఈ ఢిల్లీ పర్యటనకు సంబంధించి సీఎం కార్యాలయం బుధవారం నాడు ప్రకటన విడుదల చేసింది.
మరో వైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడ గురువారం నాడు ఢిల్లీ వెళ్ళి, అక్టోబర్ 4 శుక్రవారం నాడు ఉదయం 11.30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలతో పాటు విభజన హామీల పరిష్కారం, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి అంశాలపై ప్రధాని మోదీతో చర్చించనున్నారు. ఒక రోజు వ్యవధిలో రెండు తెలుగు రాష్టాల ముఖ్యమంత్రులు ప్రధాని మోదీతో సమావేశం కానుండడంతో ఈ పర్యటనలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
[subscribe]