తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాద సంఘటనలో, బోటు వెలికితీత కోసం జరుగుతున్న పనులను అధికారులు నిలిపివేశారు. గోదావరిలో నీటి ఉధృతి తీవ్రంగా పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలియజేసారు. గోదావరిలో మునిగిన ప్రైవేట్ టూరిజం బోటు రాయల్ వశిష్ట పున్నమిని బయటకు తీసేందుకు ధర్మాడి సత్యం బృందం గత మూడు రోజులుగా విశ్వ ప్రయత్నాలు చేస్తుంది, అయితే వెలికితీత చర్యల్లో ఎటువంటి పురోగతి కనిపించలేదు. గోదావరి ప్రవాహం ఎక్కువుగా ఉండడంతో బోటు వెలికితీత చర్యలు కొనసాగించడం ధర్మాడి బృందానికి పెనుసవాల్గా మారింది.
బోటు ప్రమాదం జరిగి ఇప్పటికి చాలా రోజులు గడుస్తున్నా గల్లంతైన వారిలో ఇంకా 15మంది మృతదేహాలు లభ్యం కాకపోవడంతో వారి కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్రమైన ఆవేదనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల అనుగుణంగా జిల్లా యంత్రాంగం బాలాజీ మెరైన్స్ అనే సంస్థకు బోటు వెలికితీత పనులను అప్పగించింది. రంగంలోకి దిగిన వారి బృందం రెండువేల మీటర్ల ఐరన్ రోప్ తో, భారీ ప్రొక్లయిన్స్ తో వెలికితీత పనులు చేపడుతున్నారు. మంగళవారం తీవ్ర ప్రయత్నం చేయగా రోప్ తెగిపోవడంతో వారి అంచనాలు తప్పాయి. ఈ క్రమంలో గోదావరిలో నీటి ఉధృతి కారణంగా ప్రస్తుతం వెలికితీత పనులు నిలిపివేసినట్టు ప్రకటించారు.
[subscribe]