ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో రోజు రోజుకీ అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది. ఈ క్రమంలో మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఆయన తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్లపై విరుచుకుపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలవలేని వాళ్లు, పనికిమాలిన వాళ్ళు అందరూ ఒకచోట చేరి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారని, వచ్చే ఎన్నికల్లో మళ్ళీ వారికి ఓటమి తప్పదని అన్నారు. నారా లోకేష్కు జయంతికి, వర్థంతికి తేడా తెలియదని, తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మంగళగిరిలో గెలవలేకపోయాడని నాని ఎద్దేవా చేశారు.
లోకేష్లో విషయం లేదు కాబట్టే.. పార్టీని బ్రతికించుకోవడానికి చంద్రబాబు పక్క పార్టీలపై ఆధారపడుతున్నారని కొడాలి నాని అన్నారు. రాజకీయాలలో సీఎం జగన్ పులి కాబట్టే మంగళగిరిలో నువ్వు ఆహారం అయ్యావని లోకేష్ను విమర్శించారు. సీఎం జగన్ తీసుకొచ్చిన విధానం వల్ల ఇసుక మీద సంవత్సరానికి రూ.750 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతోందని, దీనిపై లోకేష్ విమర్శలు మానుకోవాలని సూచించారు. అలాగే రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడానికే సీఎం జగన్ మూడు రాజధానుల విధానం తీసుకొచ్చారని, ఈ విషయంలో ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. ఈసారి ఎన్నికల్లో ఏపీలోని అన్ని స్థానాలను వైఎస్సార్సీపీ గెలుచుకుంటుందని కొడాలి నాని స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY