ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా స్వయం సాధికారిత పెంపొందించేలా “వైఎస్ఆర్ చేయూత” పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. బుడగ జంగం, వాల్మీకి, ఏనేటి కొంద్, బెంతొ ఒరియా కులాల వారికి కులధ్రువీకరణ పత్రం అవసరం లేకుండానే వైఎస్ఆర్ చేయూత పథకం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కులాల్లో పలువురు అర్హత ఉండి కూడా కులధ్రువీకరణ పత్రం లేకపోవడంతో చేయూత పథకం ద్వారా లబ్దిపొందలేకపోయారని కొందరు మంత్రులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయా కులాల్లో అర్హత కలిగిన లబ్దిదారులకు కులధ్రువీకరణ పత్రం లేకున్నా చేయూత పథకం అమలు చేయాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
ముందుగా ఆగస్టు 12 న వైఎస్ఆర్ చేయూత పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన 45–60 ఏళ్లలోపు అర్హత గల మహిళలకు ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగు సంవత్సరాల్లో మొత్తంగా రూ.75 వేలు అందజేయనున్నారు. అందులో భాగంగా మొదటి విడత సాయంగా దాదాపు 25 లక్షల మంది మహిళ లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా రూ.18,750 జమచేశారు. వైఎస్ఆర్ చేయూత పథకం కోసం బడ్జెట్లో రూ.4,700 కోట్లు కేటాయించారు, నాలుగేళ్లలో మొత్తం రూ.17 వేల కోట్లను లబ్ధిదారులకు అందించనున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu