ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) తొలగింపు అంశంపై ఏపీ హైకోర్టు ఇటీవల కీలక తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం ఈ అంశంపై జారీచేసిన జీవోలను రద్దు చేసి, నిమ్మగడ్డ రమేశ్కుమార్ నే తిరిగి ఎస్ఈసీగా నియమించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఈ రోజు (జూన్ 1, సోమవారం) సుప్రీంకోర్టులో ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని, సర్వీసు నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్ను రద్దు చేయడం, అలాగే రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వి.కనగరాజ్ను నియమిస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవోను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను త్వరలోనే సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించే అవకాశం ఉంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu