ప్రకాశం జిల్లా కురిచేడు మండల కేంద్రంలో మద్యానికి బానిసలై శానిటైజర్ తాగి అస్వస్థతకు గురై ఇప్పటికి 10 మంది చనిపోయారు. ఈ ఘటనపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. కురిచేడులో మరణాలపై సమగ్ర విచారణ చేపట్టి కారణాలు వెలికి తీయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. “మద్యం నిషేధిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం రాష్ట్రంలో ఊరూరా నాటు సారా ఏరులై పారుతున్నా నిర్లిప్తంగా వ్యవహరిస్తోంది. ఫలితంగా మద్యానికి బానిసలైనవాళ్లు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రకాశం జిల్లా కురిచేడులో మద్యం బదులు శానిటైజర్ తాగి తొమ్మిది మంది మృత్యువాతపడ్డారని తెలిసింది. మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మత్తు కోసం నాటు సారా, శానిటైజర్ కలుపుకొని తాగారని క్షేత్ర స్థాయి నుంచి సమాచారం అందుతోంది. ఈ మరణాలపై సమగ్ర విచారణ చేపట్టాలని” పవన్ కళ్యాణ్ అన్నారు.
“కురిచేడులో చనిపోయినవారు పేద కుటుంబాలవారే ఉన్నారు. ఆ కుటుంబాలకు ప్రభుత్వం తగిన సహాయం అందించాలి. ఆసుపత్రిలో చేరినవారికి మెరుగైన వైద్య సహాయం ఇవ్వాలి. నాటు సారా ముఠాలు పెరిగిపోయాయనీ, దీనికి అలవాటుపడ్డవాళ్ళు ఆరోగ్యాలు చెడగొట్టుకొంటున్నారని మహిళలు ఆవేదన చెందుతున్నారు. నాటు సారాను అరికట్టడంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. ఈ విషయంలో నిర్లిప్తతకు తోడు మద్యం దుకాణాలను తెరిచి ఉంచే సమయం మరో గంటసేపు పొడిగించడం చూస్తుంటే ప్రభుత్వానికి మద్య నిషేధంపై చిత్తశుద్ధి లేదని అర్ధం అవుతోంది. నాటు సారా సరఫరా పెరుగుతున్నా, మద్యం దుకాణాల ముందు బారులు తీరి జనాలు ఉంటున్నా మద్య విమోచన కమిటీ స్పందించడం లేదు. ప్రభుత్వ డి-ఎడిక్షన్ కేంద్రాలు కూడా పని చేయడం లేదని సమాచారం ఉంది. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఒక డి-ఎడిక్షన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి అవి సమర్ధంగా పని చేసేలా చర్యలు తీసుకోవాలని” పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu