ఆంధ్రప్రదేశ్లో ఇకపై ఆన్లైన్లో సినిమా టిక్కెట్లను విక్రయించడంపై రాష్ట్ర ప్రభుత్వం సినిమా థియేటర్లకు మార్గదర్శకాలను జారీ చేసింది. రాష్ట్రం లోని సినిమా హాళ్లు ఇకపై తమ సినిమా టిక్కెట్లను ప్రభుత్వ ఆధీనంలోని ఆన్లైన్ ప్లాట్ఫారమ్ ద్వారా మేతమే విక్రయించడాన్ని తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేక జీవో తెచ్చిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి శుక్రవారం తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. కాగా ఈ ఆన్లైన్ బుకింగ్ వ్యవస్థను ఆంధ్ర రాష్ట్ర చలనచిత్ర మరియు థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏఫీఎఫ్డీసీ) నిర్వహించనుంది.
దీంతో ఇకపై రాష్టంలోని థియేటర్లు ఏపీఎఫ్డీసీతో అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారానే టిక్కెట్ల అమ్మకాలు చేపట్టాల్సి ఉంటుంది. అలాగే విక్రయించే ప్రతి టికెట్ పై 2 శాతం మాత్రమే సర్వీస్ చార్జీ వసూలు చేయాలని సూచించింది. అంతేకాకుండా ఎగ్జిబిటర్లు నిర్దేశించిన సమయాల్లో మాత్రమే చిత్రాలను ప్రదర్శిస్తారు మరియు టిక్కెట్ ధరలు పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో ఉంటాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ పోర్టల్ని ప్రభుత్వ ఆధ్వర్యంలోని కార్పొరేషన్ నిర్వహిస్తున్నందున రోజువారీ ప్రాతిపదికన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గేట్వే ద్వారా థియేటర్లకు చెల్లింపు చేయబడుతుందని అధికారులు స్పష్టం చేశారు.
ప్రతిపాదిత ఆన్లైన్ మూవీ బుకింగ్ సిస్టమ్ ట్రాఫిక్ సమస్యలను తగ్గించడంతో పాటు బ్లాక్-మార్కెటింగ్ను అరికట్టడంలో సహాయపడుతుందని అధికారులు పేర్కొన్నారు. ఇంకా ప్రజలు ఎక్కువ సమయం క్యూలలో నిలబడకుండా టిక్కెట్లు పొందేందుకు ఇది దోహదపడుతుందని కూడా వారు తెలిపారు. అయితే థియేటర్లలో ప్రదర్శించాల్సిన షోల సంఖ్యను నియంత్రించడం మరియు బెనిఫిట్ షోల సంఖ్యను పరిమితం చేయడం వంటి వాటిపై కూడా ప్రభుత్వం నియంత్రణ చేపట్టింది. పన్ను ఎగవేతను అరికట్టడం మరియు సామాన్య ప్రజలకు సినిమా వినోదాన్ని అందుబాటులో ఉంచడం వంటి కారణాలను ప్రస్తావిస్తూ.. దేశంలో సినిమా టిక్కెట్ల అమ్మకాలపై నియంత్రణ తీసుకున్న మొదటి రాష్ట్రంగా ఏపీ నిలిచింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF