ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ దిగుబడులు పెంపొందించి, రైతులకు ఆదాయం పెంచడమే లక్ష్యంగా మూడు దశల్లో మొత్తం 11,158 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్వహించింది. డిసెంబర్ 18, బుధవారం నాడు తన క్యాంపు కార్యాలయంలో రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, సంబంధిత ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జనవరి 17,2020 నుంచి గ్రామ సచివాలయాల పక్కనే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం ప్రారంభించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మొదటి దశలో జనవరి నాటికి 3,300 కేంద్రాలు, రెండో దశ ఫిబ్రవరిలో మరో 5 వేల కేంద్రాలు, మూడో దశలో ఏప్రిల్ నాటికి మొత్తం 11,158 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు పూర్తి కావాలని పేర్కొన్నారు.
ఈ రైతు కేంద్రాల ద్వారా సర్టిఫై చేసిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ రంగంలో వాడే ఉత్పత్తులను అందుబాటులో ఉండే ధరలకు విక్రయించాలని ఆదేశించారు. అలాగే రైతులకు పంటలకు సంబంధించిన సలహాలు, సూచనలు ఇవ్వడమే గాక రైతులకు ప్రభుత్వ పథకాలను అందించడంలో ఈ కేంద్రాలు కీలకంగా వ్యవహరించాలని కోరారు. విత్తనాల తయారీదారులు నాణ్యత పరీక్షలు పూర్తి చేసిన తర్వాతే వాటిని రైతు భరోసా కేంద్రాలకు పంపించాలని స్పష్టం చేశారు. పంటలకు బీమా సదుపాయం, పశువులకు బీమా సదుపాయం, కౌలు రైతుల సాగు ఒప్పందాల ప్రక్రియ కూడా రైతు భరోసా కేంద్రాల్లోనే జరిగేలా చూడాలని కోరారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, ఇతర పంట సంబంధిత ఉత్పత్తుల ఆర్డర్ ఇవ్వడానికి ఈ కేంద్రాల్లో డిజిటల్ కియోస్క్ లను ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.
[subscribe]