చిత్తూరు జిల్లా, కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల ఏర్పాటు సందర్భంగా అపశృతి చోటుచేసుకుంది. శాంతిపురం ఏడో మైలులో పవన్ జన్మదినం సందర్భంగా అభిమానులు ఫ్లెక్సీలు కడుతుండగా, విద్యుదాఘాతంతో ముగ్గురు మృతి చెందారు. మరో నలుగురు గాయపడగా, వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ జన సైనికుల మరణం మాటలకు అందని విషాదమని అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
”జనసైనికులు సోమశేఖర్, రాజేంద్ర, అరుణాచలం విద్యుత్ షాక్ తో దుర్మరణం పాలవడం తీవ్ర దిగ్భాంతికి గురి చేసింది. శాంతిపురం దగ్గర కటౌట్ కడుతుంటే విద్యుత్ షాక్ తగలడం వల్ల వారు చనిపోయారనే వార్త నా మనసుని కలచివేసింది. ఇది మాటలకు అందని విషాదం. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఆ తల్లితండ్రుల గర్భ శోకాన్ని అర్ధం చేసుకోగలను. దూరమైన బిడ్డలను తిరిగి తీసుకురాలేను కనుక ఆ తల్లితండ్రులకు నేనే ఒక బిడ్డగా నిలుస్తాను. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్ధిక సహాయం అందించాలని పార్టీ కార్యాలయ సిబ్బందిని ఆదేశించాను. మరో నలుగురు జన సైనికులు హరికృష్ణ, పవన్, సుబ్రహ్మణ్యం, అరుణ్ చికిత్స పొందుతున్నారు అనే సమాచారం ఉంది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా చూడాలని స్థానిక నాయకులకు తెలిపాను. వారు త్వరగా కోలుకోవాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను. బాధిత కుటుంబాలకు అవసరమైన తక్షణ సహాయం అందించాలని చిత్తూరు జిల్లా జనసేన నాయకులకు సూచించాను” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
మరోవైపు ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న చిత్రం “వకీల్ సాబ్” యూనిట్ కూడా స్పందించింది. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలువాలని ప్రార్ధించారు. ఈ ఘటనలో మృతి చెందిన అభిమానుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్ధిక సాయాన్ని అందిస్తామని వకీల్ సాబ్ చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. వకీల్ సాబ్ చిత్రాన్ని దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, బోనికపూర్ కు చెందిన బేవ్యూ ప్రాజెక్ట్స్ సంస్థతో కలిసి నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu