నవంబర్ 16, శనివారం నాడు అనిల్ అంబానీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. బకాయిలు చెల్లించలేక ఆర్కామ్ ఇప్పటికే తన మొబైల్ సంబంధిత కార్యకలాపాలను మూసివేసింది. ఐబీసీ నేతృత్వంలో దివాలా ప్రక్రియ ద్వారా ఆర్కామ్ ఆస్తులు అమ్మకానికి వస్తున్న నేపథ్యంలో డైరెక్టర్ అనిల్ అంబానీ తో పాటు కంపెనీ ఇతర డైరెక్టర్లు ఛాయ విరాణి, రినా కరణి, మంజారి కాకర్, సురేష్ రంగాచార్ కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు శనివారం నాడు కంపెనీ బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ కు ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు.
ఇంతకుముందే డైరెక్టర్ పదవికి మరియు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పదవికి వి.మణికాంతన్ కూడ రాజీనామా చేసినట్లుగా కంపెనీ తెలిపింది. డైరెక్టర్ల రాజీనామాలను పరిశీలన కోసం కంపెనీ రుణదాతల కమిటీ ముందు ఉంచినట్టుగా పేర్కొన్నారు. నవంబర్ 15, శుక్రవారం నాడు ఆర్కామ్ షేర్ ధర 3.28 శాతం పడిపోయి రూ 0.59 వద్ద ముగిసింది. అదేవిధంగా శుక్రవారం నాడు విడుదల చేసిన రెండో త్రైమాసికంలో ఆర్కామ్ రూ.30,142 కోట్ల ఏకీకృత నష్టాలు నమోదు చేసింది. మరో వైపు దివాలా ప్రక్రియ ద్వారా ఆర్కాం ఆస్తులను కొనుగోలు చేయాలని చూసే సంస్థలలో ప్రధానంగా రిలయన్స్ జియో పోటీలో ఉన్నట్టు తెలుస్తుంది.
[subscribe]