ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు అనుమతిస్తూ మార్చ్ 20, శుక్రవారం నాడు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ముందుగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇళ్ల పట్టాల పంపిణీ ఏప్రిల్ 14 వరకు వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. అలాగే రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ప్రకటించారు. ఎన్నికల సంఘం నిర్ణయం పై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా సుప్రీంకోర్టు కూడా ఎస్ఈసీ నిర్ణయాన్ని సమర్థించింది. అయితే కొత్త పథకాల అమలు కోసం ఈసీ అనుమతి తీసుకోవాలని పేర్కొంటూ, ఇప్పటి వరకు అమలు చేస్తున్న పథకాలను కొనసాగించుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అందులో భాగంగానే ఇళ్ల పట్టాలు పంపిణీకి అనుమతి ఇస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఈరోజు ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు రాష్ట్రంలో ‘పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ’ కార్యక్రమంపై ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. తాడేపల్లి లోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో జిల్లాల వారీగా ఇళ్ల పట్టాల పంపిణీ కోసం సేకరించిన స్థలాలు, మరియు ప్లాట్ల అభివృద్ధిపై చర్చించారు. అలాగే ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి రోజున ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. గతంలో ఉగాది పండుగ రోజున ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు.
[subscribe]