తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ క్రమంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మార్చ్ 21న జరగాల్సిన పరీక్ష మాత్రం యధావిధిగా నిర్వహించాలని సూచించింది. ఇక మార్చ్ 23 నుంచి మార్చ్ 30 వరకు జరగాల్సిన అన్ని పదో తరగతి పరీక్షలను రీ షెడ్యూల్ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. అదేవిధంగా మార్చ్ 30 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు జరగవలసిన పరీక్షలపై అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోర్టు సూచించింది. ముందుగా రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పదవ తరగతి పరీక్షలను నిర్వహించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని అత్యవసరంగా భావించిన హైకోర్టు ఈ రోజు విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు విన్న తర్వాత పరీక్షను వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ రాష్ట్రంలో మార్చి 19 గురువారం నాటికి కోవిడ్-19 (కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య 16కు చేరుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ బుధవారం నాడు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పదవతరగతి పరీక్షలు యధాతథంగా నిర్వహించాలని నిర్ణయించారు. అయితే తాజాగా కోర్టు తీర్పుతో మార్చ్ 30 వరకూ జరగాల్సిన పరీక్షలు అన్ని వాయిదా పడే అవకాశం ఉంది.