ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో త్వరలో కారుణ్య నియామకాలు చేపట్టనున్నామని మంత్రి పేర్ని నాని తెలిపారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన 1800 మంది కుటుంబాలకు ఆర్టీసీతో పాటు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగం కల్పించనున్నామని వెల్లడించారు. ఆర్టీసీ ఉద్యోగులకు కారుణ్య నియామకాల కింద 45 ప్రభుత్వ శాఖల్లో భర్తీ చేయాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయని చెప్పారు. దీనిపై సిఎం జగన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారన్నారు. కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇవ్వనున్న వారికి సంబంధిత జిల్లాల్లోనే ఉద్యోగం కల్పించాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామని మంత్రి నాని పేర్కొన్నారు.
కేంద్రం ఆధ్వర్యంలోని బంకుల్లో కంటే బయట బంకుల్లోనే ఆర్టీసీ బస్సులకు డీజిల్ కొంటున్నామని, ఎందుకంటే డీజిల్ ధర లీటర్కు 22 రూపాయల వరకు వ్యత్యాసం ఉంటుందని పేర్ని నాని చెప్పారు. సాధారణంగా రోజుకు ఏపీలో ఆర్టీసీ బస్సులకు 8లక్షల లీటర్ల ఆయిల్ కొనుగోలు చేస్తున్నామని, ఈ నిర్ణయం వలన రోజుకు కోటి 50 లక్షల రూపాయలు వరకు సంస్థపై భారం పడకుండా ఉంటుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సుల టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, త్వరలోనే 40 ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం కొనుగోలు చేయనుందని వెల్లడించారు. తిరుమల ఘాట్ రోడ్డు, తిరుపతి నుంచి నెల్లూరు, మదనపల్లికి మొదట ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతామన్నారు. అలాగే కోవిడ్ కారణంగా ఆర్టీసీలో 60 ఏండ్ల పైబడిన సీనియర్ సిటిజన్లకు మళ్ళీ 25 శాతం రాయితీని ఏప్రిల్ 1 నుంచి పునరుద్ధరిస్తామని మంత్రి పేర్ని నాని చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ