కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ లో భాగంగా ఈ చెస్ ఒలింపియాడ్ రిలే కార్యక్రమాన్ని నేడు తిరుపతిలో నిర్వహించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ క్రీడా, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా చెస్ ఒలింపియాడ్ టార్చ్ ను చేతబట్టి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రాండ్ మాస్టర్ ఆకాష్, టీటీడీ చైర్మన్ వై వీ సుబ్బా రెడ్డి, ప్రిన్సిపాల్ సెకరేటరీ వాని మోహన్, శాప్ ఎండీ ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకట్రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈ ర్యాలీలో యువత, ప్రజలు, క్రీడాకారులు, ఔత్సాహికులు భారీగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ.. తిరుపతి జిల్లాకు చెందిన తాను క్రీడా శాఖ మంత్రిగా ఉన్న ఈ సమయంలో తిరుపతి జిల్లాకు ప్రతిష్టాత్మకమైన చెస్ ఒలింపియాడ్ రిలే రావడం గర్వకారణమని, ఇందులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ పోటీల్లో పాల్గొంటున్న చెస్ ప్లేయర్స్ కి శుభాకాంక్షలు తెలిపిన రోజా, చెస్ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. చదరంగంలో మన రాష్ట్రం నుంచి గొప్ప గొప్ప క్రీడాకారులు తమ సత్తా చాటుతున్నారని తెలిపిన మంత్రి, విజయవాడకు చెందిన గ్రాండ్ మాష్టర్, అర్జున అవార్డు గ్రహీత కోనేరు హంపి రాష్ట్రం తరపునే కాకుండా, దేశం తరపున ప్రాతినిథ్యం వహించి ఎన్నో టోర్నమెంట్ లలో ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో గెలిచి తెలుగువాళ్ల సత్తా చాటిచెప్పారని తెలిపారు.
ఇంకా మంత్రి రోజా మాట్లాడుతూ.. మన రాష్ట్రానికే చెందిన గ్రాండ్ మాష్టర్ ముసునూరి రోహిత్ లలిత్ బాబు, గ్రాండ్ మాష్టర్ పెంటేల హరిక్రిష్ణ, గ్రాండ్ మాష్టర్ అర్జున అవార్డ్ గ్రహీత ద్రోణవల్లి హారిక, గ్రాండ్ మాష్టర్ కార్తీక్ వెంకట్ రామణ్ సైతం దేశం తరపున దేశ విదేశాల్లో విశేషమైన ప్రతిభను కనబరిచారన్నారు. త్వరలో మహాబలిపురంలో నిర్వహించబోతున్న చెస్ ఒలింపియాడ్ లో మన దేశానికి చెందిన క్రీడాకారులు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి చెందిన గ్రాండ్ మాష్టర్ లు మంచి విజయాలు సాధించాలని కోరుకుంటున్నట్లు మంత్రి రోజా తెలిపారు. ర్యాలీలో చివరగా చెస్ గ్రాండ్ మాస్టర్ ఆకాశ్ కు ఒలింపియాడ్ టార్చ్ ను రోజా అందించారు. ఏపీలో పర్యటన అనంతరం చెస్ ఒలింపియాడ్ టార్చ్ పుదుచ్చేరి వెళ్లనుంది.
మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా దేశంలోని 75 ప్రదేశాలలో చెస్ ఒలింపియాడ్ టార్చ్ రిలే నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా ప్రతిష్టాత్మకమైన చెస్ ఒలింపియాడ్ టార్చ్ రిలే నిర్వహించనున్నారు. వివిధ రాష్ట్రాలలో పర్యటించిన అనంతరం చివరిగా ఒలింపియాడ్ టార్చ్ చెన్నై చేరనుంది. ఈ క్రమంలో టార్చ్ నేడు తిరుపతికి చేరుకుంది. ఇక తొలిసారిగా మన దేశంలో ఈ నెల 29వ తేదీ నుండి ఆగష్టు 9 వరకు తమిళనాడులోని మహాబలిపురంలో ‘చెస్ ఒలింపియాడ్’ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూన్ 19న చెస్ ఒలింపియాడ్ టార్చ్ రిలేను ప్రారంభించిన విషయం తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ