పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో శనివారం సాయంత్రం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వీడ్కోలు కార్యక్రమం జరిగింది. రాష్ట్రపతిగా పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న రామ్నాథ్ కోవింద్ జూలై 24న పదవీ విరమణ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతికి రాజ్యసభ, లోక్సభ ఎంపీలు సంయుక్తంగా వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, పలువురు కేంద్ర మంత్రులు, రాజ్యసభ, లోక్సభ ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మాట్లాడుతూ, ఐదు సంవత్సరాల క్రితం ఇదే పార్లమెంట్ సెంట్రల్ హాల్లో భారత రాష్ట్రపతిగా ప్రమాణం చేశానని, ఎంపీలందరికీ తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాలు ఇబ్బందులు పడుతున్నాయని, మనం కూడా ఈ మహమ్మారి నుండి ఎన్నో పాఠాలు నేర్చుకుంటామని ఆశిస్తున్నానని అన్నారు. కోవిడ్ సమయంలో భారత్ యొక్క ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసించబడ్డాయన్నారు. అలాగే దేశ తదుపరి రాష్ట్రపతిగా ఎన్నికైనక ద్రౌపది ముర్ము రామ్నాథ్ కోవింద్ అభినందనలు తెలిపారు.
భారతదేశ 14వ రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ జూలై 25, 2017న ప్రమాణ స్వీకారం చేశారు. కేఆర్ నారాయణన్ తర్వాత రాష్ట్రపతి పదవిని చేపట్టిన రెండో దళితుడుగా రామ్నాథ్ కోవింద్ నిలిచారు. ముందుగా 16 ఏళ్ల పాటు 1993 వరకు ఢిల్లీ హైకోర్టు మరియు సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ఆయన ప్రాక్టీస్ చేశారు. అనంతరం రామ్నాథ్ కోవింద్ బీజేపీలో చేరి 1994లో ఉత్తరప్రదేశ్ నుండి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. వరుసగా రెండు పర్యాయాలు అనగా మార్చి 2006 వరకు 12 సంవత్సరాల పాటుగా రాజ్యసభ ఎంపీగా సేవలు అందించారు. అలాగే 2015–2017 మధ్య బీహార్ గవర్నర్ గా కూడా రామ్నాథ్ కోవింద్ విధులు నిర్వర్తించారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24న ముగియనుండగా, జూలై 25వ తేదీన పార్లమెంట్ సెంట్రల్ హాల్లో నూతన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY