అక్టోబర్, నవంబర్ నెలల్లో వివిధ విభాగాలకు సంబంధించిన పోస్టుల భర్తీకి నిర్వహించాల్సిన మెయిన్స్ పరీక్షలను వాయిదా వేసినట్టు అక్టోబర్ 15 మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కార్యదర్శి ఒక ప్రకటన విడుదల చేసారు. కొన్ని పాలనా పరమైన కారణాలవలనే ఈ పరీక్షలను వాయిదా వేసినట్టు వివరించారు. అక్టోబర్ 22వ తేదీన ఈ పరీక్షలు నిర్వహించే కొత్త తేదీలను ప్రకటిస్తామని చెప్పారు. వాయిదా పడిన వాటిల్లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, నాన్ గెజిటెడ్ పోస్టులు, పాలిటెక్నిక్ లెక్చరర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టులు, గెజిటెడ్ పోస్టుల పరీక్షలు ఉన్నాయి. మరోవైపు అక్టోబర్ 14 నుంచి 19 వరకు శాఖాపరమైన పరీక్షలను ఏపీపీఎస్సీ నిర్వహించబోతుంది, వాటికి అక్టోబర్ 16 నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం జనవరిలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండరు విడుదల చేయడానికి ప్రభుత్వ అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. అందులో భాగంగా ప్రతి విభాగంలోని ఉద్యోగాల ఖాళీల వివరాలను నవంబర్ చివరికల్లా పంపించాలని ఆయా శాఖల కార్యదర్శులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఆదేశాలిచ్చారు. ఆర్థిక శాఖ నుంచి వచ్చిన అనుమతుల ఆధారంగా జనవరి మొదటివారంలోగా ఉద్యోగాల భర్తీకి క్యాలెండరు విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది.
[subscribe]