తెలంగాణలో ఆర్టీసీ సమ్మె రోజు రోజుకు ఉధృతంగా మారుతుంది. గత 12 రోజులుగా తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెను కొనసాగిస్తున్నారు. అయితే హైకోర్టులో వారికీ కొంత ఊరట లభించింది. ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులకు సెప్టెంబర్ నెల జీతాలను ప్రభుత్వం ఇంకా చెల్లించలేదని, ఆర్టీసీలో ఉన్న 49,190 మంది కార్మికులకు వెంటనే జీతాలు చెల్లించేలా ఆర్టీసీ యాజమాన్యానికి ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ జాతీయ టీఎంయూ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ పై ఈ రోజు విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వ వివరణ కోరింది. సెప్టెంబర్ వేతనాలను చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది, సమ్మె కొనసాగుతుండడంతో జీతాల పక్రియ పూర్తి చేసేందుకు తగిన సిబ్బంది లేరని కోర్టుకు తెలిపారు.
ఇరుపక్షాల వాదన విన్న అనంతరం సోమవారం కల్లా కార్మికులకు జీతాలు ఇచ్చే ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ కేసులో తదుపరి విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. జీతాలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆర్టీసీ జేఏసీ నాయకులు స్వాగతించారు. అయినా తమ డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె కొనసాగుతుందని చెప్పారు. హైకోర్టు మంగళవారం ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రభుత్వంతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
[subscribe]