ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి మంగళవారం నాడు కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఈఏపీ సెట్-2021 లో ఇంటర్మీడియట్ మార్కులకు ఇస్తున్న 25 శాతం వెయిటేజీని తొలగిస్తునట్టు ప్రకటించారు. ఇప్పటివరకు ఇంటర్ లోని గ్రూపు సబ్జెక్టుల మార్కులకు 25 శాతం వెయిటేజీని కూడా పరిగణిస్తూ ర్యాంకులు ఇస్తున్నారు. అయితే ఈ ఏడాది కరోనా పరిస్థితుల కారణంగా ఇంటర్ పరీక్షలను రద్దు చేసి ప్రత్యేక విధానంలో విద్యార్థులకు మార్కులను కేటాయించారు. దీంతో ఈ ఒక్క ఏడాదికే ఈఏపీ సెట్ లో 25 శాతం ఇంటర్ మార్కుల వెయిటేజీ తొలగింపును అమలు చేస్తునట్టు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్టు పేర్కొన్నారు. ఈ ఏడాది ఈఏపీ సెట్ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే 100శాతం వెయిటేజీ ఇచ్చి ఫలితాలు/ర్యాంకులు ప్రకటిస్తామని చెప్పారు.
మరోవైపు ఇప్పటివరకు ఈ ప్రవేశ పరీక్ష ఎంసెట్ గా పిలువబడగా, మెడికల్ కోర్సుకు సంబంధించిన పరీక్ష నీట్ పరిధిలోకి వెళ్లిన దృష్ట్యా ఇకపై ఈఏపీ (ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ)సెట్ గా పిలువబడుతుందని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గతంలోనే ప్రకటించారు. ఇక ఆగస్టు 19 నుంచి 25 వరకు ఆన్లైన్ పద్ధతిలో ఈఏపీ సెట్-2021 ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ