ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ 3 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ వినిపించింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) బ్రహ్మానంద రెడ్డి గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఈ అవకాశాన్ని రాష్ట్రంలోని 10వ తరగతి విద్యార్థులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా జిల్లా విద్యాశాఖ అధికారులతో సంప్రదించి అవసరమైన మేరకు బస్సులు నడపాలని జిల్లా ప్రజా రవాణాశాఖ అధికారులను బ్రహ్మానంద రెడ్డి ఆదేశించారు. కాగా ఈ ఏడాది దాదాపు 6 లక్షల 50 వేల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నట్లు సమాచారం. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 3,348 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.
ఈడీ బ్రహ్మానంద రెడ్డి ఆదేశాల నేపథ్యంలో.. టెన్త్ విద్యార్థుల సౌకర్యార్థం పరీక్ష కేంద్రాలకు ఉచిత రవాణా కల్పించే నిమిత్తం పల్లె వెలుగు, సిటీ సర్వీసులను అందుబాటులో ఉంచాలని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ చెంగల్ రెడ్డి అన్ని డిపోల మేనేజర్లను ఆదేశించారు. బస్ పాసుల అవసరం లేకుండా హాల్ టికెట్ ఉంటే అనుమతించాలని, ఏప్రిల్ 3నుంచి 18వ తేదీ వరకు దీనిని పాటించాలని ఆయన స్పష్టం చేశారు. అన్ని పల్లె వెలుగు, సిటీ ఆర్జినరీ బస్సుల్లో ఈ సౌకర్యం ఉంటుందని తెలిపిన ఆయన.. హాల్ టికెట్ చూపించి విద్యార్థులు ఉచితంగా పరీక్షా కేంద్రానికి చేరుకోవచ్చని, అలాగే పరీక్ష పూర్తి అయిన అనంతరం విద్యార్థి తిరిగి తమ గమ్యస్థానాలకు ప్రయాణించవచ్చని కూడా స్పష్టం చేశారు. కాగా ఆర్టీసీ అధికారుల నిర్ణయంపై విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE