ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిసెంబర్ 27, శుక్రవారం నాడు రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలకు మద్దతుగా మౌన దీక్ష చేపట్టారు. ఉద్ధండరాయునిపాలెంలో రాజధాని కోసం ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన స్థలంలోనే కన్నా లక్ష్మీనారాయణ దీక్షకు కూర్చున్నారు. కన్నా మౌన దీక్షకు మద్దతుగా పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. దీక్ష ప్రారంభించే ముందు పవిత్ర నీరు, మట్టి ఉంచిన ప్రాంతానికి నమస్కరించారు. ఏపీ రాజధానిని అమరావతిలోనే ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం రాజధాని అంశంపై కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
రాజధాని కోసం వేల మంది రైతులు త్యాగాలు చేశారని, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపేందుకు కేంద్రప్రభుత్వం కూడా నిధులు విడుదల చేసిందని చెప్పారు. రాజధానిపై అధ్యయనం చేయడానికి నియమించిన జీఎన్ రావు కమిటీ నివేదిక ఇవ్వకముందే సీఎం వైఎస్ జగన్ ఎలా ప్రకటన చేస్తారని ప్రశ్నించారు. మరోవైపు కన్నా లక్ష్మీనారాయణ దీక్షను కవరేజ్ చేయడానికి వచ్చిన జర్నలిస్టులపై కొందరు వ్యక్తులు దాడికి దిగారు. దీంతో కొద్దిసేపు ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు మీడియా ప్రతినిధులు గాయపడినట్టుగా తెలుస్తుంది.
[subscribe]