ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తూ ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. మే 15, శుక్రవారం నుంచి ఉద్యోగులను హాజరుకావొద్దంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వారి స్థానంలో రెగ్యులర్ ఆర్టీసీ సిబ్బందిని వాడుకోవాలని ఆదేశాలిచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ నిర్ణయంతో 7,600 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే ఆర్టీసీ యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల కార్మిక సంఘాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. యాజమాన్య తీరును వ్యతిరేకిస్తూ, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పేర్నినానికి ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ లేఖ రాసింది.
కరోనా లాక్డౌన్ వలన ఏర్పడ్డ పరిస్థితులను కారణంగా చూపి ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో ఔట్సోర్సింగ్ సిబ్బందిని తొలగించవద్దని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలిచ్చినట్లు ఆ లేఖలో యూనియన్ నేతలు పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలకు వ్యతిరేకంగా ఆర్టీసీ యాజమాన్యం సిబ్బందిని తొలగించిందని, ఈ తొలగింపు నిర్ణయాన్ని వెంటనే నిలుపుదల చేయాలని కోరారు. మరోవైపు తమను యథావిధిగా కొనసాగించని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు హెచ్చరించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu