ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని, నియంత్రణ చర్యలపై పర్యవేక్షణ చేసేందుకు ఇప్పటికే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ్ బెంగాల్, హైదరాబాద్, అహ్మదాబాద్, సూరత్, చెన్నై నగరాలకు ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్స్ (ఐఎంసీటి) ను కేంద్ర ప్రభుత్వం పంపించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న మిగతా రాష్ట్రాలకూ కూడా ప్రత్యేక బృందాలను పంపాలని కేంద్రప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఐఎంసీటి బృందం కరోనా పరిస్థితిని పర్యవేక్షించడానికి మే 4 వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించబోతున్నట్టు సమాచారం.
కర్నూలు, గుంటూరు, ప్రకాశం, కృష్ణా, చిత్తూరు జిల్లాలలో రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో కేంద్ర బృందం ఈ జిల్లాల్లో పర్యటించే అవకాశముంది. అలాగే రాష్ట్రంలో రెడ్ జోన్స్, కంటైన్మెంట్ క్లస్టర్స్ ని కూడా ఈ బృందం సందర్శించనుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 30, గురువారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1403 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం 1403 పాజిటివ్ కేసులకు గాను 321 మంది డిశ్చార్జ్ కాగా, 31 మంది మరణించారు. ప్రస్తుతం 1051 మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu