తెలంగాణ రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలపై పర్యవేక్షణ చేసేందుకు ఐదు రోజులు నుంచి కేంద్ర ప్రభుత్వం పంపించిన ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ (ఐఎంసీటి) హైదరాబాద్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. జలశక్తి శాఖ అదనపు కార్యదర్శి అరుణ్ భరొకా నేతృత్వంలోని ఈ బృందం గచ్చిబౌలి కోవిడ్ ఆసుపత్రి, గాంధీ ఆసుపత్రి, కంటైన్మెంట్ జోన్స్, జీహెఛ్ఎంసీ కోవిడ్ కంట్రోల్ రూమ్, క్వారంటైన్ సెంటర్స్ తో సహా పలు ప్రదేశాలను ఇప్పటికే సందర్శించారు. ఒకవైపు తెలంగాణలో కరోనా కేసులు సంఖ్య తగ్గడంతో, పరీక్షలు సరిగ్గా చేయడం లేదని విపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఐఎంసీటి బృందం పర్యటన యొక్క కీలక వివరాలును కేంద్రం వెల్లడించింది.
హైదరాబాద్ లో పర్యటించిన కేంద్ర బృందం తెలంగాణ రాష్ట్రంలో తగినన్ని టెస్టింగ్ కిట్స్, పీపీఈలు, వైద్య సదుపాయాలు, పరికరాలు ఉన్నట్లు గుర్తించారు. ఎండ్ టు ఎండ్ ఐటీ డ్యాష్ బోర్డు ద్వారా కరోనా బాధితులను గుర్తించిన దగ్గరనుంచి, చికిత్స తర్వాత కోలుకుని డిశ్చార్జి అయ్యేంతవరకు వరకు ట్రాక్ చేస్తున్నారని కేంద్ర బృందం పేర్కొన్నట్టు ఈ రోజు మీడియా సమావేశంలో కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పుణ్య సలిల శ్రీవాస్తవ తెలిపారు. క్వారంటైన్ సెంటర్లోనూ అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటుగా, రాష్ట్రంలో లాక్డౌన్ ను పోలీసులు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారని తెలిపారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 29, బుధవారం సాయంత్రానికి కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 1016 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. అలాగే ఈ వైరస్ వలన రాష్ట్రంలో ఇప్పటివరకు 25 మంది మృతి చెందగా, 409 మంది కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్టు తెలిపారు. ప్రస్తుతం 582 మంది కరోనా బాధితులు ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]