ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమగ్ర భూముల రీసర్వే ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన “వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష” పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నాడు ప్రారంభించారు. కృష్ణాజిల్లాలోని జగ్గయ్యపేట మండలం, తక్కెళ్లపాడులో సర్వేరాయిని పాతి ఈ భూ రీసర్వే కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. ఆతర్వాత భూముల సర్వే కోసం సిద్ధం చేసిన డ్రోన్స్ను ప్రారంభించి, సర్వే కోసం వినియోగించే పరికరాలను కూడా సీఎం పరిశీలించారు. రాష్ట్రంలో గ్రామాలు, పట్టణాలు, నగరాలు, ఆవాసాలతో కలిపి అటవీ ప్రాంతాలు మినహా 1.26 లక్షల చదరపు కిలోమీటర్ల మేర సర్వే చేయనున్నారు. సమగ్ర భూ సర్వేను మూడు విడల్లో చేపట్టి జనవరి 2023 కల్లా పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం 17,460 గ్రామాల్లో మొదటి విడతలో 5000 గ్రామాల్లో, రెండో విడతలో 6,500 గ్రామాల్లో, మూడో విడతలో 5,500 గ్రామాల్లో నిర్వహించనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో దాదాపు వందేళ్ల తర్వాత భూముల సమగ్ర సర్వే జరగబోతుంది.
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, రాష్ట్రంలో మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైందని అన్నారు. సమగ్ర భూ రీసర్వే కార్యక్రమాన్ని 16 వేల మంది సర్వేయర్లతో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సర్వేయర్లకు సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో శిక్షణా అందించామని తెలిపారు. తప్పుడు రికార్డులు సృష్టించి భూములు కాజేయాలని చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. భూములపై వివాదాలు, రక్షణ లేకపోవడంపై పాదయాత్ర సమయంలో అనేకమంది బాధితుల కష్టాలు తెలుసుకున్నా. ఈ నేపథ్యంలో వందేళ్ల తర్వాత రాష్ట్రంలో మళ్లీ సమగ్ర భూ సర్వే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. మీ భూమి రక్షణకు, మా ప్రభుత్వం రక్షణ ఇస్తుందని అన్నారు. భూ రీసర్వే కోసం అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ