ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 15, 16 తేదీల్లో తిరుమలలో పర్యటించనున్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా వెంకటేశ్వర స్వామివారికి సీఎం దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను అధికారులు వెల్లడించారు.
సెప్టెంబర్ 15న సాయంత్రం 4 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి చంద్రబాబు హెలికాప్టర్లో బయలుదేరుతారు. సాయంత్రం 5.30 గంటలకు తిరుపతిలోని ఎస్వీ అగ్రికల్చర్ కళాశాల గ్రౌండ్కు చేరుకుంటారు. అనంతరం రాత్రి 7.40 గంటలకు తిరుమలలోని బేడీ ఆంజనేయస్వామివారిని దర్శించుకుంటారు.
రాత్రి 7.55 గంటల నుంచి 9.15 గంటల వరకు శ్రీవారి ఆలయంలో చంద్రబాబు దంపతులు స్వామివారిని దర్శించుకుని, అనంతరం పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. దర్శనం అనంతరం రాత్రికి తిరుమలలోని శ్రీ గాయత్రి నిలయంలో బస చేయనున్నారు.
సెప్టెంబర్ 16న ఉదయం 8.40 గంటలకు తిరుమల వీక్యూసీ-1లో ఏర్పాటు చేసిన పిల్గ్రిమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను సీఎం ప్రారంభిస్తారు. ఉదయం 9.15 గంటలకు గో గర్భం డ్యామ్ సర్కిల్ వద్ద ఎలక్ట్రిక్ బస్సులను జెండా ఊపి ప్రారంభిస్తారు. అనంతరం ఉదయం 9.35 గంటలకు ఎస్వీ మ్యూజియంను ప్రారంభిస్తారు.
తర్వాత ఉదయం 10.25 గంటల నుంచి 11.25 గంటల వరకు శ్రీ పద్మావతి రెస్ట్ హౌస్లో నిర్వహించే పలు సమావేశాల్లో చంద్రబాబు పాల్గొంటారు. పర్యటన ముగించుకుని మధ్యాహ్నం 12.25 గంటలకు తిరుపతి నుంచి హెలికాప్టర్లో బయలుదేరుతారు. మధ్యాహ్నం 1.55 గంటలకు ఉండవల్లిలోని తన నివాసానికి సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు చేరుకుంటారు.
కాగా, సెప్టెంబర్ 15 నుంచి తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో రవిచంద్రతో పాటు ఆలయ పండితులు ఇటీవల ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో చంద్రబాబును ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాల ప్రారంభ రోజున సీఎం తిరుమల పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.


































