దక్షిణాదిలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సోమవారం ఉదయం వరద ప్రభావిత ఆరు జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై కీలక సూచనలిచ్చారు.
- ముంపు ప్రాంతాలలోని ప్రతి కుటుంబానికి 48 గంటల్లోగా తక్షణ సాయంగా రూ.2 వేలు అందించాలి.
- ఆర్ధిక సాయంతో పాటు 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళాదుంపలు, కేజీ ఉల్లిపాయలు, కేజీ పామాయిల్ ప్యాకెట్ కూడా అందజేయాలి.
- కలెక్టర్లు పర్యవేక్షణలో సీనియర్ అధికారులు కిందిస్థాయి సిబ్బందితో సమన్వయం చేసుకోవాలి.
- ప్రతీ సచివాలయంలో 10 మంది ఉద్యోగులు ఉండగా, ప్రతీ 50 ఇళ్లకూ ఒక వాలంటీర్ పనిచేస్తున్నందున సరుకుల పంపిణీని సత్వరమే అందేలా చర్యలు తీసుకోవాలి.
- అవసరం ఉన్నచోట శిబిరాలు కొనసాగించాలి. అలాగే శిబిరాల్లో ఉన్నవారికి మంచి తాజా ఆహారం, శుద్ధమైన త్రాగునీరు అందించాలి.
- అలాగే గర్భవతుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి, అత్యవసరమైతే ఆస్పత్రులకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలి.
- వరద తగ్గుముఖం పట్టిన 10 రోజుల్లో పంట నష్టం, ఆస్తి నష్టాలపై అంచనాలు సిద్ధం చేయాలి.
- వరదల కారణంగా అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నందున, వైద్య శాఖను అప్రమత్తం చేసి ఆస్పత్రుల్లో సిబ్బంది, మందులు తదితరాలు సరిపడా ఉండేలా చూసుకోవాలి.
- వరదల వలన పశు సంపదకు వాటిల్లిన నష్టంపై అంచనా వేయడంతో పాటు మిగిలిన పశువులకు పశుగ్రాసం, దాణా సరిగా అందేలా చూడాలి.
- గోదావరి పరివాహక ప్రాంతంలో కట్టలు బలహీనంగా ఉన్నచోట ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో పాటు గట్లు, కాల్వలకు ఎక్కడ గండ్లుపడినా వెంటనే వాటిని పూడ్చివేయడానికి ముందస్తు చర్యలు చేపట్టాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ