వలసలకు నెలవుగా ఉండే ఉత్తరాంధ్ర.. త్వరలోనే కొలువులకు నెలవుగా మారబోతోందని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. బుధవారం ఆయన ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించారు. పర్యటనలో భాగంగా ముందుగా విజయనగరం చేరుకున్న సీఎం జగన్ అక్కడ పలు కీలక ప్రాజెక్టులకు అంకురార్పణ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న జిల్లాలోని భోగాపురం ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణం మరియు తారకరామతీర్ధ సాగర్ ప్రాజెక్ట్ మిగులు పనులకు శిలాఫలకాల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భోగాపురం మండలం సవరవిల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఆ తర్వాత విశాఖపట్నం చేరుకొని మధురవాడ ఐటీ హిల్స్లో నూతనంగా నిర్మిస్తున్న వైజాగ్ ఐటీ టెక్ పార్కుకు శంకుస్థాపన చేశారు.
ఇక సవరవిల్లి బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘అన్ని ప్రాంతాలు బాగుపడాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. ఇటీవలే మూలపేటలో పోర్టుకు శంకుస్థాపన చేశాం. ఎయిర్ పోర్టు ఉత్తరాంధ్రకు కేంద్ర బిందువుగా మారనుంది. రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర జాబ్ హబ్ గా మారనుంది. భోగాపురం ఎయిర్ పోర్టును 2026లో మళ్లీ నేనే వచ్చి ప్రారంభిస్తాను. భోగాపురం ఎయిర్ పోర్ట్ ని రూ.4952 కోట్లతో జీఎంఆర్ విశాఖ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో నిర్మించబోతున్నాం. ఈ ఎయిర్ పోర్ట్ 4 కోట్ల జనాభాకు సరిపోయేలా డిజైన్ చేశాం. దీనిలో భాగంగా 7 ఎయిరో బ్రిడ్జిలు, కార్గో టెర్మినల్, ఎంఆర్వో సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం. ఎ 320, ఎ 380 డబుల్ డెక్కర్ ఫ్లైట్స్ ల్యాండయ్యేలా రన్ వే ఉండబోతోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సపోర్ట్ చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియాకు, పోర్ట్ నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు. పోర్టు నిర్మాణంలో భాగంగా భూములు ఇచ్చిన 4 గ్రామాల ప్రజలకు గేటెడ్ కమ్యూనిటీ తరహాలో ఇళ్లు కట్టించి పునరావాసం కల్పించాం’ అని పేర్కొన్నారు.
ఇంకా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘గత ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి తేడా చూడండి. మంచి జరిగిందని భావిస్తే నన్ను ఆశీర్వదించండి. ఇచ్చిన హామీలు నెరవేర్చాం కాబట్టే మీ ముందుకు వచ్చాం. మరి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ప్రజల వద్దకు వచ్చేందుకు దమ్ముందా? చేసింది చెప్పడానికి చంద్రబాబు దగ్గర ఏం లేదు. ఆయన పాలనలో.. దోచుకో, పంచుకో, దాచుకో అనే రీతిలో రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఏ మంచి చేయని చంద్రబాబుకు దత్త పుత్రుడుగా మారిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఎందుకు సహకరిస్తున్నారు?’ అని ప్రశ్నించారు. ఇంకా ఆయన ఇలా అన్నారు.. ఈ సెప్టెంబర్ నుంచే విశాఖ కేంద్రంగా పాలన కొనసాగిస్తాం. అలాగే త్వరలోనే విశాఖపట్టణంలో అదానీ డేటా సెంటర్ కి శంకుస్థాపన చేయబోతున్నాం. ఈ డేటా సెంటర్ రాకతో ఉత్తరాంద్ర ముఖచిత్రమే మారబోతోంది. రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధితో పాటు యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి’ తెలియజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE