కీలకమైన కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న కొన్ని అవకతవకలపై ప్రస్తుత అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సిట్’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సదరు సిట్పై స్టే విధిస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీం కొట్టివేసింది. బుధవారం దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సిటి రవికుమార్ల ధర్మాసనం, ఈ కేసును మెరిట్ ప్రాతిపదికన విచారించి తుది నిర్ణయాన్ని వెలువరించాలని హైకోర్టుకు సుప్రీం సూచించింది. ఈ సందర్భంగా.. గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష చేయకూడదని చెప్పడం అంటే.. 100శాతం ఇమ్యూనిటీ ఇచ్చినట్లే కదా? అని ప్రశ్నించింది. అయినా ప్రాథమిక దశలోనే దర్యాప్తును అడ్డుకోవడం సమంజసం కాదని అభిప్రాయపడిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. ప్రభుత్వ విధాన నిర్ణయాలలో ప్రజాధనం దుర్వినియోగం, దురుద్దేశం తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని సిట్ విచారణకు ఆమోదం తెలిపింది.
కాగా టీడీపీ ప్రభుత్వం హయాంలో రాజధాని అమరావతి ప్రాంతంలో భారీ భూ కుంభకోణం జరిగిందన్న ఆరోపణలు, పలు విధానపరమైన నిర్ణయాలు మరియు ఇతర ప్రాజెక్టులలో చోటుచేసుకున్న అవకతవకలపై దర్యాప్తు చేయడం కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ‘సిట్’ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సిట్ ఏర్పాటును ఏపీ హైకోర్టులో టీడీపీ నేతలు వర్ల రామయ్య, మాజీ మంత్రి ఆలపాటి రాజా తదితరులు సవాల్ చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు, సిట్పై గతేడాది సెప్టెంబర్ 15న స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అదే ఏడాది నవంబర్లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ నేపథ్యంలో దీనిపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం, సిట్ దర్యాప్తుకు అనుమతిస్తూ నేడు ఆదేశాలు ఇచ్చింది. దీంతో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తీసుకున్న పలు నిర్ణయాలపై సిట్ దర్యాప్తు చేయనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE