ఈరోజు ఉత్తరాంధ్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. విశాఖపట్నం మరియు అనకాపల్లి జిల్లాల పరిధిలో దాదాపు 1.23 ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్హులైన లబ్ధిదారులకు ఇంటి స్థలాల పట్టాలను సీఎం జగన్ పంపిణీ చేశారు. పర్యటనలో భాగంగా.. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారం వైఎస్సార్ పార్క్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన పైలాన్ను ఆవిష్కరించిన అనంతరం మోడల్ గృహాల్ని లబ్ధిదారులకు అందజేశారు. ఆపై బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు.
సీఎం జగన్ సభలో మాట్లాడుతూ.. ఈరోజు 1.23 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామని, ఒక్క కాలనీలోనే 10228 ఇళ్ల నిర్మాణం జరుగుతోందని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 30 లక్షల 70 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చామని, 17 వేల జగనన్న కాలనీలు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. దీనికోసం రూ. 55 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, మరో రూ. 32 వేల కోట్లతో కాలనీలలో కనీస సౌకర్యాల కల్పన ఏర్పాటుచేయనున్నట్లు పేర్కొన్నారు. 16 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా ప్రారంభించామని, మిగిలిన వాటిని త్వరలోనే పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు.
గృహనిర్మాణ పథకం, టైటిల్ డీడ్ల జారీ అనేది నిరంతర ప్రక్రియ అని, దరఖాస్తులు స్వీకరించిన 90 రోజులలోపు అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. గ్రామ సచివాలయంలోని వాలంటీర్లు, సిబ్బంది దరఖాస్తును స్వీకరించిన 12 రోజుల్లోగా ఫిజికల్ వెరిఫికేషన్ పూర్తి చేయాలని, సామాజిక తనిఖీ ద్వారా లబ్ధిదారులను గుర్తించాలని చెప్పారు. అలాగే నిర్మాణాల్లో ఏకరూపత, నాణ్యత ఉండేలా చర్యలు తీసుకోవాలని, అందించిన సౌకర్యాలు, వాటి నిర్మాణ విధానంపై పూర్తి వివరాలను అందజేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వైఎస్ఆర్ జగనన్న కాలనీల్లో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలన్నారు. డంపింగ్ యార్డులకు బయో మైనింగ్ నిర్వహించి వీలైనంత త్వరగా ప్రారంభించాలని అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ