ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల పర్యటన నిమిత్తం వైఎస్సార్ కడప జిల్లాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనుల్లో పాల్గొంటున్నారు. దీనిలో భాగంగా పులివెందుల పట్టణం లోని ‘ఏపీ కార్ల్’లో బయో సైన్స్ టెక్కు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. నేచురల్ ఫార్మింగ్ అవసరాన్ని మనందరం గుర్తించాలని పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో మనం తీసుకునే ఆహారంలో అనేక రకాల కెమికల్స్ ఉంటున్నాయని, తద్వారా శరీరంలోకి క్యాన్సర్ ప్రవేశిస్తోందని తెలిపారు. ప్రకృతి వ్యవసాయంపై అంతర్జాతీయ సంస్థలతో మన ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంటోందని, వాటి సలహాలు, సూచనలతో రైతులకు ప్రకృతి వ్యవసాయంలో మెళకువలు నేర్పించటానికి ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు.
సహజ పద్దతుల్లో పండించిన ధాన్యం, కూరగాయలు, పండ్లు వంటివి ఆరోగ్యానికి మంచిదని సీఎం జగన్ చెప్పారు. ఏపీలో ఆరు లక్షల మంది రైతులు ఇప్పటికే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని, రైతులు దీనిపై దృష్టి సారించేలా నిపుణులు ప్రోత్సహించాలని సూచించారు. ప్రభుత్వ పరంగా ఆర్బీకే కేంద్రాలు ఏర్పాటు చేశామని, వీటిద్వారా రైతులకు నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను అందిస్తున్నామని సీఎం జగన్ వెల్లడించారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతుల పెట్టుబడి వ్యయాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం తరపున పలు చర్యలు చేపడుతున్నామని కూడా తెలిపారు. ఇక ఈ కార్యక్రమం అనంతరం సీఎం జగన్ పులివెందుల నియోజక వర్గం లోని వేంపల్లిలో డాక్టర్ వైఎస్సార్ స్మారక పార్క్ను ప్రారంభించనున్నారు.
దీనికి ముందు సీఎం జగన్ పులివెందుల ఆర్అండ్బీ అతిథి గృహంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అలాగే స్థానిక ప్రజలతో మాట్లాడి వారి వినతులు స్వీకరించారు. పులివెందుల, తొండూరు మండలాల నాయకులతో వేర్వేరుగా సమీక్షలు నిర్వహించారు. రెండు మండలాల్లో పార్టీ నాయకులు ఎదుర్కొంటున్న సమస్యలు, జరుగుతున్న అభివృద్ధి పనులు ఇతర అంశాలపై సుమారు గంటపాటు సమీక్షించారు. ఈ సమావేశంలో మంత్రి ఆదిమూలపు సురేశ్, ఎంపీ అవినాశ్ రెడ్డి పులివెందుల మున్సిపాలిటీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్తోపాటు కౌన్సిలర్లు, తొండూరు మండలానికి చెందిన పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ