కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వం రద్దుపై ఒక్క ఆంధ్రప్రదేశ్ తప్ప దేశమంతా స్పందించిందని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం విజయవాడలో నిర్వహించిన మీట్ ది ప్రెస్లో పాల్గొన్న ఆయన ఏపీలోని అన్ని రాజకీయ పార్టీల అధినేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కేవీపీ రామచంద్రరావు మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ప్రశ్నించడం మొదలు పెట్టగానే మోదీ ప్రభుత్వం తల్లక్రిందులైపోయిందని, ఒక అవినీతి పరుడిని ప్రశ్నిస్తే దేశద్రోహం కింద వస్తుందా? అని కేంద్రం తీరుపై మండిపడ్డారు. ఈ దేశానికి మూడు తరాల పాటు గాంధీ కుటుంబం సేవచేసిన విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని, పార్లమెంట్ సభ్యుడి ప్రసంగాన్ని తొలగించడం దారుణమని, ఈ అన్యాయంపై ప్రతి ఒక్కరూ నిలదీయాలని కేవీపీ పిలునిచ్చారు.
ఒక పార్లమెంట్ సభ్యుడి అనర్హతపై సంతకం చేయాల్సింది రాష్ట్రపతి అని, రాహుల్ గాంధీ అనర్హత పత్రంపై రాష్ట్రపతి సంతకం చేశారా? అని కేవీపీ రామచంద్రరావు ప్రశ్నించారు. ఇదంతా తేలకుండానే హడావిడిగా ఇల్లు ఖాళీ చేయాలంటూ రాహుల్ గాంధీకి నోటీసులిచ్చారని, కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై న్యాయపరంగా పోరాడుతామని తెలిపారు. ఇక రాహుల్ గాంధీ విషయంలో దేశమంతా స్పందించిందని, అయితే ఏపీ నుంచి 25 మంది ఎంపీలు.. 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారని, వీరిలో ఏ ఒక్క ఎంపీ అయినా రాహుల్ గాంధీ అనర్హత వేటుపై స్పందించారా? అని ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నిజంగా సీనియర్ నాయకుడేనా? రాహుల్ గాంధీ అనర్హత వేటు అంశంపై ఆయన ఎందుకు స్పందించరు? సమాజం పట్ల చంద్రబాబుకు బాధ్యత లేదా? అని కేవీపీ నిలదీశారు.
ఇక ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని జనసేన అధ్యక్షడు పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతుంటారని, అయితే దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ రాహుల్ గాంధీ విషయంలో జరిగిన విధానాన్ని ఖండిస్తుంటే ఆయన ఎందుకు దీనిపై నోరు మెదపలేదని రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం జనసేన ఆంతరంగిక సమావేశాల్లోనైనా రాహుల్ గాంధీ అనర్హత విషయాన్ని ఖండించలేకపోయారెందుకు? ఈరోజు ప్రశ్నించలేకపోతే, ఇక ఏ సందర్భంలో ప్రశ్నిస్తారు? అంటూ జనసేనానిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పైనా కేవీపీ కీలక వ్యాఖ్యలు చేశారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆత్మీయుడిగా ఉన్న తాను ఎందుకు సీఎం జగన్ కు దూరంగా ఉంటున్నాననే విషయం గురించి త్వరలోనే చెపుతానని, ఎప్పటికైనా ఈ విషయం గురించి మాట్లాడాల్సిందేనని పేర్కొన్నారు. అయితే ఇప్పుడే దీనిపై మాట్లాడనని.. కానీ, దీనిపై మరో రోజు మీడియా ముఖంగా అన్ని విషయాలను వివరిస్తానని కేవీపీ రామచంద్రరావు చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE