కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో పరిశ్రమలు మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో గల కియా కార్ల పరిశ్రమపై కూడా కరోనా ప్రభావం పడింది. మూడో విడత లాక్డౌన్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం కొన్ని రంగాలకు మినహాయింపులు ఇచ్చింది. దీంతో కరోనా లాక్డౌన్తో 40 రోజులకు పైగా మూసివేయబడ్డ కియా పరిశ్రమ మే 12, మంగళవారం నుంచి కార్ల ఉత్పత్తిని తిరిగి ప్రారంభించింది.
కియా పరిశ్రమలో మొత్తం 4,500 మంది పనిచేస్తుండగా, ఇప్పుడు 1000 మంది కార్మికులతోనే ఉత్పత్తి ప్రారంభించినట్టు కంపెనీ యాజమాన్యం తెలిపింది. అలాగే గతంలో ఈ ప్లాంట్ లో గంటకు 50 కార్లు ఉత్పత్తి కాగా, ప్రస్తుతం 30 కార్లు మాత్రమే ఉత్పత్తి అవుతున్నట్టు తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తున్నామని, ఎంట్రీ పాయింట్ వద్దే కార్మికులను పరీక్షించి, మాస్కులు ధరించిన వారినే లోపలి అనుమతిస్తున్నట్టు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu