ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పరీక్షలు మరింతగా ఊపందుకోనున్నాయి. కరోనా నిర్ధారణ వైద్య పరీక్షల కోసం ఒక లక్ష కరోనా ర్యాపిడ్ టెస్టు కిట్లు రాష్ట్రానికి చేరాయి. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దక్షిణ కొరియా నుంచి ప్రత్యేక చార్టర్ విమానంలో ఈ టెస్టు కిట్లను ఏపీకి తీసుకొచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 17, శుక్రవారం నాడు సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ టెస్ట్ కిట్లను ప్రారంభించారు. ఈ ర్యాపిడ్ టెస్టు కిట్ల ద్వారా కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే కరోనా ఫలితాన్ని కనుక్కోవచ్చని అధికారులు తెలిపారు. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ ఉందో లేదో నిర్ధారించడమే కాకుండా ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గినా సరే ఈ కిట్లు గుర్తిస్తాయని పేర్కొన్నారు.
రాష్ట్రంలో కమ్యూనిటీ టెస్టింగ్ కోసం ఈ ర్యాపిడ్ కిట్లు వినియోగిస్తామని అధికారులు వెల్లడించారు. ఇక నాలుగైదు రోజుల్లో అన్ని జిల్లాలకు ఈ కిట్లు పంపించనున్నారు. ఈ టెస్టు కిట్స్ ప్రారంభ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా. కేఎస్ జవహర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. మరోవైపు రాష్ట్రంలో శుక్రవారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 572 కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. 572 పాజిటివ్ కేసులకు గాను 35 మంది ఇప్పటికే డిశ్చార్జ్ కాగా, 14 మంది మరణించారని, ప్రస్తుతం 523 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu