ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి క్రమంగా విజృంభిస్తుంది. ఈ క్రమంలో కరోనాపై ఏపీ ప్రభుత్వం తాజా బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 12కి పెరిగినట్టుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ రోజు విశాఖపట్నంలో కొత్తగా మరో కేసు నమోదయిందని, బర్మింగ్ హాం నుంచి వచ్చిన వ్యక్తి తో కాంటాక్ట్ లో ఉన్న వ్యక్తికి కరోనా వైరస్ సోకిందని చెప్పారు. ఇప్పటివరకు విదేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే కరోనా సోకగా, రాష్ట్రంలో తొలిసారిగా కాంటాక్ట్ ద్వారా వచ్చిన కేసు నమోదైంది. దీంతో ఏపీలో కూడా కరోనా వ్యాప్తి రెండో దశలోకి అడుగు పెట్టినట్టయింది. అలాగే ఇప్పటివరకు 384 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 317 మందికి కరోనా లేదని వైద్యులు తేల్చారని చెప్పారు. ఇంకా 55 మంది రిపోర్టులు రావాల్సి ఉందని పేర్కొన్నారు.
కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో పాటుగా పలు చర్యలు తీసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్చ్ 26, గురువారం సాయంత్రం 5 గంటలకు మీడియా సమావేశం నిర్వహించి, రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్ సందర్భంగా పాటించాల్సిన పలు నియమాలపై రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కరోనా మహమ్మారిని అదుపు చేయాలంటే లాక్డౌన్ ప్రకటించిన మూడు వారాల పాటు ఎక్కడి వారు అక్కడే ఉండి పోవాలని, బయటకు రావొద్దని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అంతకంటే మరో మార్గం లేదని సీఎం వైఎస్ జగన్ ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.