మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి శుక్రవారం సీబీఐ విచారణకు హజరయ్యారు. ఈరోజు విచారణకు రావాల్సిందిగా ఆయనకు సెక్షన్ 160 కింద సీబీఐ నోటీసులు ఇచ్చింది. దీంతో ఎంపీ అవినాష్ రెడ్డి నేడు హైదరాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయంలో అధికారుల ఎదుట హాజరయ్యారు. వివేకా హత్య కేసుకి సంబంధించి అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించనున్నారు. కాగా ఇంతకుముందు ఇదే కేసులో జనవరి 28వ తేదీన అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఇక వివేకా హత్య కేసులో అవినాష్తో పాటు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డికి కూడా సీబీఐ ఈ నెల 18న నోటీసులు జారీ చేసింది. భాస్కర్ రెడ్డిని 23వ తేదీన సీబీఐ కార్యాలయానికి రావాల్సిందిగా కోరగా.. ఆ రోజు హాజరు కాలేనని ఆయన సీబీఐకి సమాచారం ఇచ్చారు. అయితే 24వ తేదీన విచారణకు రావాలని అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన ఈరోజు సీబీఐ విచారణకు హజరయ్యారు.
కాగా వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి మరియు తండ్రి భాస్కర్ రెడ్డిల పాత్ర కీలకంగా ఉన్నట్లు సీబీఐ భావిస్తోంది. ఈ క్రమంలో విచారణ ముగిసిన తర్వాత కీలక పరిణామం చోటుచేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు కోఠిలోని సీబీఐ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. అలాగే ఎంపీతో పాటు కార్యాలయం వద్దకు వచ్చిన ఆయన అనుచరులను వెనక్కి పంపిస్తున్నారు. ఇక అవినాష్ రెడ్డి విచారణ సందర్భంగా సీబీఐ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక 2019 మార్చి 19వ తేదీన పులివెందులలోని నివాసంలోనే వైఎస్ వివేకా హత్య చేయబడ్డారు. ఈ కేసును సీబీఐతో విచారణ చేయించాలని వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అలాగే ఈ కేసు విచారణను ఏపీలో కాకుండా మరేదైనా ఇతర రాష్ట్రంలో నిర్వహించాలని పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సమ్మతించిన సుప్రీం కేసు విచారణను తెలంగాణకు బదిలీ చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే సీబీఐ దర్యాప్తులో దూకుడు పెంచింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE