రాజధాని ప్రాంత గ్రామాల్లో రైతులు చేపడుతున్న ఆందోళనలకు మద్దతుగా డిసెంబర్ 31, మంగళవారం నాడు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆ ప్రాంతంలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రైతులు, కూలీలు, మహిళల ఆవేదన చూసి తన హృదయం ద్రవించిపోయిందని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నూతన సంవత్సరం, సంక్రాంతి వేడుకలకు దూరంగా ఉండనున్నట్లు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. “ఐదుకోట్లమంది ప్రజల కోసం 33 వేల ఎకరాలును రాజధాని అమరావతి నిర్మాణానికి రైతులు ఆనందంగా ఇచ్చారు. అలాంటి రైతులు ఇప్పుడు దైన్యంగా రోడ్లపైకి వచ్చి శాంతియుతంగా నిరాహార దీక్షలు, నిరసనలు చేస్తున్నారు. ఎన్నడూ గడపదాటని గృహిణులు సైతం రోడ్లపైకి రావాల్సిన దుస్థితి రావడం మన దౌర్భాగ్యం. తమ బిడ్డల భవిష్యత్ కోసం భూములు ఇచ్చామని, అసలు ఇప్పుడు భవిష్యత్ లేకుండా పాలకులు నిర్ణయాలు చేస్తున్నారని రైతులు కన్నీటితో చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త సంవత్సర వేడుకలు గాని, సంక్రాంతి వేడుకలు గాని చేసుకునేందుకు మనసు అంగీకరించడం లేదు. ఈసారి వేడుకలకు నేను దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. అందువల్ల మీకు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్పలేకపోతున్నందుకు క్షంతవ్యుణ్ణి. అమరావతి రైతులు, వారి కుటుంబాలు ఆనందంగా ఉన్న రోజే తనకు నిజమైన సంక్రాంతి అని” పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
[subscribe]