ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై మరోసారి కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సమకాలీన రాజకీయ పరిస్థితులపై ఆయన అప్పుడప్పుడూ తన అభిప్రాయాలను కుండా బద్దలు కొట్టినట్లు చెబుతుంటారు. ప్రభుత్వ, ప్రతిపక్షాల విధానాలపై ఉండవల్లి చేసే వ్యాఖ్యలు అందర్నీ ఆకర్షిస్తుంటాయి. మంగళవారం తాజాగా ఆయన రాజమండ్రిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రం విడిపోయినప్పటి పరిస్థితులకి, ప్రస్తుత పరిస్థితులకి ఏం తేడా లేదని, రాష్ట్ర హక్కులు సాధించడంలో చంద్రబాబు, జగన్ ఇద్దరూ విఫలమయ్యారని పేర్కొన్నారు. అప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ ఏం మాట్లాడారో, ఇప్పుడు జగన్ హయాంలో చంద్రబాబు కూడా అలాగే మాట్లాడుతున్నారని ఉండవల్లి చెప్పారు.
రాష్ట్రం విడిపోయి 8 ఏళ్ళు గడుస్తున్నా, ఇద్దరు ముఖ్యమంత్రులు మారినా రాష్ట్ర సమస్యలు మాత్రం అలానే ఉన్నాయని ఉండవల్లి తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా చూడని విధంగా తనకు ఓట్లు వేసే వారికే సంక్షేమ ఫలాలు అందించే విధానంతో జగన్ ముందుకు వెళుతున్నాడని, తనను వ్యతిరేకించేవారికి ఏం చేసినా రేపు తనకు ఓట్లు వేయరని భావిస్తున్నాడని, రేపు ఇది ఏ మేరకు ఫలితాన్నిస్తుందో చూడాలని వ్యాఖ్యానించారు. ఏపీలో 3 ప్రాంతీయ పార్టీలున్నా.. అందరూ కేంద్రం లోని బీజేపీకే మద్దతు తెలుపుతారని, రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా ప్రశ్నించే స్థితిలో లేరని అసహనం వ్యక్తం చేశారు. పోలవరం కింద 30వేల కోట్లు నష్ట పరిహారం ఇవ్వాల్సి ఉందని, అందుకే కేంద్రం పోలవరం నిర్మాణానికి ఆసక్తి చూపడం లేదని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ