ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు గడువు దగ్గర కొచ్చేసింది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేసిన ఎన్నికల అధికారులు.. ఇక పోలింగ్ ఏర్పాట్లపై దృష్టి సారించారు. మే 13 న ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ జరగనుండటంతో.. ఆ దిశగా ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని కేటగిరీల వారికి హోం ఓటింగ్ను సీఈసీ అందుబాటులోకి తెచ్చింది. 85 ఏళ్లు పైబడినవారితో పాటు.. 40 శాతం అంగవైకల్యం పైబడిన దివ్యాంగులకు హోం ఓటింగ్ సదుపాయాన్ని కల్పించింది. ఏపీ వ్యాప్తంగా మొత్తం 7,28,484 మంది హోం ఓటింగ్ కు అర్హత కలిగిఉన్నట్లు ఈసీ గుర్తించింది. వీరిలో 85 ఏళ్లు పైబడినవారు.. 2లక్షల 11వేల257 మంది ఉండగా, దివ్యాంగులు 5లక్షల17వేల227 ఉన్నారు. కానీ వీరిలో కేవలం 28,591 మంది ఓటర్లు మాత్రమే హోం ఓటింగ్ విధానాన్ని ఎంచుకోవడంపై ఈసీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది.
హోం ఓటింగ్ ను ఎంచుకున్న వారిలో 14,577 మంది 85 ఏళ్లు పైబడినవారు, 14,014 మంది 40 శాతం అంగవైకల్యం పైబడిన దివ్యాంగులు ఉన్నారు. మార్చి 16 న ఎన్నికల షెడ్యూలు ప్రకటించగా .. అప్పటి నుంచి నుంచి ఏప్రిల్ 22 వరకూ అధికారుల బృందాలు అర్హులైనవారి ఇంటి వద్దకే వెళ్లి హోం ఓటింగ్ ను వినియోగించుకోవడానికి ఫారం -12D లను సేకరించారు. అయితే హోం ఓటింగ్ కు అర్హత ఉండీ కూడా కేవలం 3 శాతం మంది ఓటర్లు మాత్రమే ఈ హోం ఓటింగ్ సదుపాయాన్ని ఎంచుకున్నారు.అలాగే మే మూడో తేదీ నుంచి హోం ఓటింగ్ ఎంచుకున్నవారి ఇంటి వద్దకు అధికారుల బృందాలు వెళ్లి..వారికి బ్యాలెట్ పేపర్లను అందజేసి హోం ఓటింగ్ ప్రక్రియ చేపడుతూ వస్తున్నారు.
హోం ఓటింగ్ ప్రక్రియ మొత్తం మే 8కి పూర్తవుతుందని ఏపీ సీఈవో ముకేష్ కుమార్ మీనా తెలిపారు. అయితే ఏడు లక్షల పైబడి ఓటర్లకు హోం ఓటింగ్ అర్హత ఉన్నా కూడా.. కేవలం 28 వేల పైచిలుకు మాత్రమే ఎంచుకోవడంపై అధికారులు ఆరా తీస్తున్నారు. హోం ఓటింగ్నే ఇంత తక్కువ శాతం మంది వినియోగించుకుంటే.. ఎండలు మండిపోతుండటంతో వృద్దులు, దివ్యాంగులు ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాలకు వస్తారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY