ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంత గ్రామాల రైతులు చేస్తున్న ఆందోళనలు, నిరసనలు 67వ రోజుకి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో మందడం గ్రామంలో జరిగిన పోలీసుల లాఠీచార్జ్కు నిరసనగా అమరావతి జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు రాజధాని గ్రామాల్లో బంద్ కొనసాగుతోంది. రాజధాని ప్రాంత 29 గ్రామాల్లో వ్యాపారులు స్వచ్చంధంగా దుకాణాలు మూసివేసి బంద్ పాటిస్తున్నారు. అత్యవసర సేవలు మినహా ఇతర వ్యాపార కార్యకలాపాలన్నీ నిలిపేసి బంద్ ను కొనసాగిస్తున్నారు.
మరోవైపు రాజధాని ప్రాంతంలోని పలు గ్రామాల్లో రైతులు, మహిళలు ధర్నా చేస్తున్నారు. అమరావతి రైతుల ఉద్యమానికి కొన్ని విద్యార్థి సంఘాలు సైతం మద్దతు పలుకుతున్నాయి. విద్యార్థి ప్రతినిధుల బృందాలు రైతుల దీక్షా శిబిరాలకు చేరుకొని సంఘీభావం తెలుపుతున్నారు. తుళ్లూరు, మందడం, వెలగపూడి, రాయపూడి, పెదపరిమి, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం వంటి గ్రామాల్లో రైతులు దీక్షా శిబిరాలు, ధర్నాలను కొనసాగిస్తున్నారు.
[subscribe]