అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 24,25 తేదీల్లో భారతదేశంలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్ పర్యటన సందర్భంగా ఆయన గౌరవార్థం ఫిబ్రవరి 25న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ విందు ఇవ్వనున్నారు. ఈ విందు కార్యక్రమానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను రాష్ట్రపతి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ కోసం నిర్వహించే విందు కార్యక్రమంలో పాల్గొనాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఆహ్వానం అందినట్లుగా తెలుస్తుంది. దీంతో ఈనెల 25న సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి ఇచ్చే విందుకు హాజరుకానున్నారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్, హర్యానా, ఒడిశాతో పాటుగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా రాష్ట్రపతి కార్యాలయం నుంచి విందుకు హాజరుకావాల్సిందిగా ఆహ్వానం అందినట్లు సమాచారం.
[subscribe]