ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న పలు నిర్ణయాలపై విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీఐజీ కొల్లి రఘురామ్రెడ్డి ఆధ్వర్యంలో 10 మంది సభ్యులతో కూడిన సిట్ను ఏర్పాటు చేస్తూ ఫిబ్రవరి 21, శుక్రవారం నాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా గత ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించి గతంలో మంత్రివర్గ ఉప సంఘం సమర్పించిన నివేదికలోని అంశాలపై కూడా సిట్ దర్యాప్తు జరుపుతుందని వెల్లడించారు. రాజధాని అమరావతి భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్, సీఆర్డీఏ పరిధిలోని సరిహద్దుల మార్పులు, ఇతర అవకతవకలు, అవినీతి ఆరోపణలపై సిట్ ప్రత్యేక దృష్టి సారించి లోతైన విచారణ జరుపనున్నారు.
రాజధాని అమరావతి ప్రాంతంలో బినామీల పేరుతో టీడీపీ నాయకులు 4వేల ఎకరాలు కొన్నారని గత కొంతకాలంగా రాష్ట్ర మంత్రులు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమరావతిలో జరిగిన న్యాయ, ఆర్థిక పరమైన అక్రమాలపై కూడా సిట్ విచారణ చేయనుంది. దర్యాప్తు చేస్తున్న పలు రకాల అంశాలకు సంబంధించి ఏ వ్యక్తినైనా, అధికారినైనా పిలిపించి వాంగ్మూలం రికార్డు చేసుకునే అధికారం సిట్కు ఉందని జారీ చేసిన జీవోలో పేర్కొన్నారు. అలాగే ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ తమ్మినేని సీతారం ఇచ్చిన ఆదేశాల మేరకే విచారణ చేపడుతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. మరోవైపు సిట్ సభ్యులుగా ఐపీఎస్ అధికారులు జయరామ్రాజు, అట్టాడ బాబూజీ, విజయ్ భాస్కర్, కెనడీ, శ్రీనివాసన్, వెంకట అప్పలనాయుడు, ఎస్వీ రాజశేఖర్రెడ్డి, గిరిధర్, శ్రీనివాస్రెడ్డిలను నియమించింది.
[subscribe]