జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అక్టోబర్ 23, బుధవారం నాడు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ప్రకాశం జిల్లాకు చెందిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రి మీద కేసులు ఉంటే రాష్ట్ర ప్రయోజనాలు ఏమి కాపాడతారని, ఇటీవల ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో అదే జరిగిందని అన్నారు. కేంద్ర మంత్రుల ఇంటర్వూలు సైతం లభించడంలేదని, వారి దగ్గర రాష్ట్ర ప్రాజెక్టుల గురించి బలంగా మాట్లాడలేక పోతున్నారని, ఒకవేళ మాట్లాడితే సీబీఐ కేసులు బయటకు తెస్తారేమో అనే భయం ముఖ్యమంత్రికి ఉందని చెప్పారు. కోడికత్తి కేసు, చిన్నాన్న హత్య కేసులో అధికారంలో లేనప్పుడు ఏపీ పోలీసులపై నమ్మకం లేదని సీబీఐ ఎంక్వయిరీ కోరిన వాళ్ళు అధికారం వచ్చాక ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
ఇసుక సమస్య భవన నిర్మాణ కార్మికులదే కాదు. నిర్మాణ రంగానికి అనుబంధంగా ఉన్న అన్ని పరిశ్రమలపై ఈ ప్రభావం ఉంటుంది. ఇసుక సామాన్యుడికి లభించడం లేదు కానీ వెళ్లాల్సిన చోటకు వెళ్తోంది, బ్లాక్మార్కెట్లో పక్క రాష్ట్రాలకు తరలిపోతోంది అని చెప్పారు. భవన నిర్మాణ కార్మికుల కోసం నవంబరు 3న విశాఖలో యాత్ర చేపట్టాం, దానికి మద్దతు కావాలని కార్యకర్తలను కోరారు. అన్ని విషయాలు తెలుసుకునే రాజకీయాల్లోకి వచ్చానని, తన అంతిమ శ్వాస వరకు రాజకీయ పార్టీని నడుపుతానని, ఒక ఎన్నికలలో ఓటమితో భయపడే వ్యక్తిని కాదని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చెప్పారు. సమావేశం అనంతరం నవంబరు 3న విశాఖలో నిర్వహించే లాంగ్ మార్చ్ కు సంబంధించిన వాల్ పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు. అదే విధంగా జనసేన పార్టీ నెల్లూరు జిల్లా నాయకులు, కార్యకర్తల సమావేశం అక్టోబర్ 24, గురువారం నాడు మధ్యాహ్నం 3గంటలకు జరగనుంది.
[subscribe]