తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు స్పష్టం చేసారు. మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ అంశంపై అక్టోబర్ 23, బుధవారం నాడు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ సంసిద్ధతను రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలుపుతామని వెల్లడించారు. ఎన్నికలకు సంబంధించిన పూర్తి పక్రియకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. ఈ సమీక్ష సమావేశానికి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
హైకోర్టు తీర్పుతో మరోసారి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొనబోతుంది. నవంబర్ మొదటివారంలో ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించి, నవంబర్ మూడో వారంలోపు ఎన్నికల నిర్వహణను పూర్తి చేసే దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రణాళికలు తయారు చేస్తున్నట్టుగా సమాచారం. రాష్ట్రంలో మొత్తం 13 కార్పోరేషన్స్, 128 మున్సిపాలిటీలు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ కార్పోరేషన్ల పదవికాలం పూర్తికాకపోవడంతో మిగిలిన 10 కార్పోరేషన్స్ లలో మాత్రమే ఎన్నికలు జరగబోతున్నాయి. అదే విధంగా కొన్ని కారణాల వలన 5 మున్సిపాలిటీలలో, పదవీకాలం పూర్తి కానందువలన సిద్దిపేట, అచ్చంపేటలలో ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించరు. ఇక మిగిలిన 121 మున్సిపాలిటీలలో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. గత కొంతకాలంగా మున్సిపల్ ఎన్నికల అంశం కోర్టు పరిధిలో ఉంది, ఇప్పుడు తీర్పు వెలువడిన నేపథ్యంలో ప్రధాన పార్టీలైన టిఆర్ఎస్, కాంగ్రెస్ ఎన్నికలపై కసరత్తు మొదలుపెట్టనున్నాయి.
[subscribe]