టీఆర్ఎస్ నాయకుడు వంటేరు ప్రతాప్రెడ్డిని తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ నూతన చైర్మన్గా నియమిస్తూ అక్టోబర్ 23, బుధవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వంటేరు ప్రతాప్రెడ్డి రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ నేపథ్యంలో నూతన చైర్మన్గా ఎన్నికైన ఆయనకు విధులు నిర్వహించేందుకు కార్యాలయం, సిబ్బంది, వాహనాలతో పాటు ఇతర సౌకర్యాలును అందించాల్సిందిగా అటవీ మంత్రిత్వ శాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి ఉత్తర్వులను జారీ చేశారు.
రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నియమితులైన వంటేరు ప్రతాపరెడ్డి, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రతాపరెడ్డిని అభినందించారు. అటవీ సంపద రక్షణ, పచ్చదనం పెంపుదలపై ఆయనకు సీఎం కేసీఆర్ పలు సూచనలు చేసారు. తెలంగాణలో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికలలో గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన వంటేరు ప్రతాపరెడ్డి, సీఎం కేసీఆర్ పై ఓడిపోయారు, అనంతరం కాంగ్రెస్ పార్టీని వీడి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
[subscribe]