ఈఎస్ఐ కుంభకోణం విచారణలో భాగంగా టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడు అరెస్టుపై జనసేన పార్టీ స్పందించింది. అసెంబ్లీ సమావేశాలకు నాలుగైదు రోజుల ముందు అచ్చెన్నాయుడుని అరెస్టు చేయడం సందేహాలకు తావిస్తోందని జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు.
“తెలుగుదేశం శాసనసభ్యుడు అచ్చెన్నాయుడు అరెస్టు అవినీతికి పాల్పడినందుకా? లేదా రాజకీయ కక్ష సాధింపు కోసమా అనే విషయంలో వై.ఎస్.ఆర్.సి.పి. ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. అవినీతి ఏ రూపంలో ఉన్నా దానికి బాధ్యులు ఎంతటి వారైనా జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అయితే అసెంబ్లీ సమావేశాలకు నాలుగైదు రోజుల ముందు అచ్చెన్నాయుడుని అరెస్టు చేయడం సందేహాలకు తావిస్తోంది. అదే విధంగా ఒక శాసనసభ్యుడిని అరెస్ట్ చేసే ముందు రాజ్యాంగ నియమ నిబంధనలను పాటించవలసిన అవసరం ప్రభుత్వంపై ఉంది. అచ్చెన్నాయుడు అరెస్టులో అవి లోపించినట్లు కనిపిస్తున్నాయి. ఈ.ఎస్.ఐ.లో జరిగిన అవకతవకలతోపాటు ఇప్పటి వరకు జరిగిన అన్ని అక్రమాలపై దర్యాప్తు జరిపించాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తోందని” నాదెండ్ల మనోహర్ అన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu