జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి 12న కర్నూలులో పర్యటించనున్నారు. విద్యార్థి సుగాలి ప్రీతిపై అత్యాచారం, హత్యఘటనకు పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ, 12వ తేదీన కర్నూలులో ర్యాలీ చేపట్టి, బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు రాజ్ విహార్ కూడలి నుంచి కోట్ల కూడలి వరకూ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో జనసేన నాయకులు, శ్రేణులు, వివిధ ప్రజా సంఘాలు పాల్గొంటాయి. అనంతరం కోట్ల కూడలిలో బహిరంగసభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు.
అలాగే 13వ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకూ కర్నూలు, ఎమ్మిగనూరులో జరిగే కార్యక్రమాల్లో పాల్గొని, క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకోనున్నారు. కర్నూలులో ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్న జోహరాపురం వంతెన సమస్యపై స్థానికులతో సమావేశమవుతారు. అనంతరం జి+2 గృహాలను నిర్మించిన ప్రాంతానికి వెళ్తారు. గృహాలు పొందిన లబ్ధిదారులతో సమావేశం అవుతారు. ఆ తర్వాత వీవర్స్ కాలనీని సందర్శించి చేనేత కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు.
[subscribe]