ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్, దివంగత టీడీపీ నాయకుడు కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరామ్, అక్టోబర్ 9 బుధవారం నాడు మంగళగిరి కోర్టు ఎదుట హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఫర్నీచర్ కు సంబంధించిన కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు శివరామ్ మంగళగిరి న్యాయస్థానానికి వచ్చారు. ఇటీవలే తనపై నమోదైన కేసులకు స్పందిస్తూ కోర్టులో లొంగిపోయిన విషయం తెలిసిందే. కోడెల శివప్రసాదరావు స్పీకర్ గా పనిచేసిన కాలంలో తరలించిన ఫర్నిచర్ శివరామ్ కు చెందిన బైక్ షోరూమ్లో లభించడంతో ఆయనపై సెక్షన్ 409, 411 ల కింద పోలీసులు కేసు నమోదు చేసారు.
ఈ విషయంపై కోడెల శివరామ్ లాయర్ మాట్లాడుతూ, శివరామ్ కి హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం వలన, అందుకు సంబంధించిన పూచీకత్తును కోర్టుకు సమర్పించారని తెలిపారు. అదే విధంగా ప్రతి శుక్రవారం నాడు శివరామ్ తుళ్లూరు పోలీస్ స్టేషన్ కి వ్యక్తిగతంగా హాజరై సంతకం పెట్టవలసి ఉంటుందని చెప్పారు.
[subscribe]