ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి స్వల్ప పర్యటన నిమిత్తం మంగళవారం నగరానికి వస్తున్నారు. ఈరోజు వైజాగ్లో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ కానున్నారు. హర్యానా సీఎం ఖట్టర్ వ్యక్తిగత పర్యటనలో భాగంగా గత రెండు రోజులుగా వైజాగ్ నగరంలోనే ఉన్నారు. ఈ క్రమంలో హర్యానా సీఎం ఖట్టర్తో మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశమవనున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ఐటీ రాజధానిగా పేరొందిన వైజాగ్లో పరిశ్రమల వంటి రంగాలలో రెండు రాష్ట్రాల మధ్య సహకారం ఉండే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అయితే సీఎం జగన్ పర్యటనకు ముందుగా ఏపీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ హర్యానా సీఎంతో సమావేశమయ్యారు. వారిరువురూ కలిసి స్థానిక ప్రసిద్ధి చెందిన సింహాచలంలోని నరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య భేటీ స్నేహ పూర్వకంగానే జరుగబోతోందని ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ ప్రకటించారు.
షెడ్యూల్ ప్రకారం సీఎం జగన్ మంగళవారం ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటారు. విమానాశ్రయంలో స్థానిక నేతలతో కొద్దిసేపు ముచ్చటించనున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో రుషికొండలోని పెమా వెల్నెస్ రిసార్ట్కు వెళ్లి హర్యానా సీఎంను కలుస్తారు. జగన్ మధ్యాహ్నం 1.30 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి 2.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో నగర పోలీసు కమిషనర్ సిహెచ్. శ్రీకాంత్ ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. విమానాశ్రయంలో భద్రతా ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్తో కలిసి ఆయన సమీక్షించారు. అనంతరం పోలీస్ కమిషనర్ రుషికొండలోని వెల్నెస్ రిసార్ట్కు వెళ్లి సీఎం పర్యటనకు సంబంధించిన భద్రతా అంశాలపై రిసార్ట్ యాజమాన్యంతో చర్చించారు. రెవెన్యూ, అగ్నిమాపక, పోలీసు శాఖల అధికారులు పాల్గొన్నారు. నగరంలో ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల మధ్య వివిధ మార్గాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. మంగళవారం నగరంలో వీఐపీల రాకపోకలను దృష్టిలో ఉంచుకుని వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ