ఎన్నికలు సమీపిస్తుండటంతో అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. వైసీపీ అధినేత జగన్ ఇప్పటికే ఏడు జాబితాలు ప్రకటించి ప్రచారానికి సిద్ధమవుతుండగా.. పొత్తుల లెక్కలలో సీట్ల సర్ధుబాటు కోసం టీడీపీ-జనసేనల కూటమి ఇంకా తర్జనభర్జన పడుతుంది. ఇప్పటికే దీనిపై చాలా సార్లు సమావేశమైన రెండు పార్టీల అధినేతల మధ్య 90% చర్చలు పూర్తయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జనసేన 26 సీట్లు సర్ధుబాటు చేసిన టీడీపీ.. మరో 9 సీట్లు కేటాయించి మొత్తం 35 స్థానాలలో జనసేన అభ్యర్థులను నిలపడానికి ఒప్పందం కుదిర్చుకున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ఇప్పటికే ఐదు స్థానాలు కేటాయించిన టీడీపీ.. మరో స్థానం అయిన రామచంద్రపురం కూడా జనసేనకు కేటాయించినట్లు తెలుస్తుంది.
ఇప్పటికే రాజానగరం, రాజమండ్రి, కాకినాడ రూరల్, పిఠాపురం, రాజోలు స్థానాలను జనసేనకు కేటాయించగా.. చివరి ఒప్పందంలో భాగంగా రామచంద్రపురం కూడా జనసేన అధినేత పవన్..పట్టుబట్టి ఇప్పించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో రామచంద్రపురం నియోజకవర్గంలో పోటీ చేయనున్న అభ్యర్థులలో గుబులు మొదలైంది. ఇక్కడ టీడీపీ టికెట్ కోసం ఇప్పటికే పదిమంది ప్రయత్నాలు కొనసాగిస్తుండగా.. జనసేన నుంచి 2019లో పోటీ చేసిన పోలిశెట్టి చంద్రశేఖర్ తో పాటు కొత్తగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన చిక్కాల దొరబాబు పేర్లు తెర మీదకు వచ్చాయి.
చిక్కాల దొరబాబు మాజీ మంత్రి చిక్కాల రామచంద్ర రావు తమ్ముడు కావడంతో.. అన్న సహకారంతో అటు టీడీపీలోనూ ఇటు కాపు సామాజిక వర్గంలో ప్లస్ అవనుంది. దీంతో ఈ మూడు విషయాలపై పట్టు బిగించి విజయకేతనం ఎగరవేయడానికి ప్రయత్నాలు కొనసాగిస్తుండగా.. రామచంద్రపురం టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా చిక్కాల దొరబాబు పేరునే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో రామచంద్రపురం ఎవరికి దక్కుతుందోనన్న చర్చ మొదలయింది.
దీంతో ఇప్పటివరకు ఈ సీటు టీడీపీకి వస్తుందని అది తమకే వస్తుందని ఎదురుచూసిన ఆశావాహులు ఇక తప్పనిసరిగా.. జనసేనకు సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు బీజేపీతో చివరిసారి మంతనాలు జరుగుతున్న టీడీపీ, జనసేన పార్టీలు..తమ అభ్యర్థుల ప్రకటనను ఒకటి రెండు రోజుల్లో పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే బీజేపీ కూటమికి ఐదు 3 ఎంపీ సీట్లు, 5 లేక 6 ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలని ఆ పార్టీ పట్టుపడుతోంది.
ఇప్పుడు ఈ కూటమికి బీజేపీతో ఒప్పందం కుదిరితే.. జనసేనకు 35 ఎమ్మెల్యే సీట్లతో పాటు 3 ఎంపీ సీట్లు దక్కే అవకాశం ఉంటుంది. ఒకవేళ కనుక బీజేపీతో టీడీపీ,జనసేనకు పొత్తు కుదరకపోతే 5 ఎమ్మెల్యే సీట్లు, ఒక ఎంపీ సీటు జనసేనకు పెరిగే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మార్చి మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE