అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ ‘సిద్ధం’ సభలో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ పై జరిగిన దాడి రాజకీయ దుమారానికే కాదు.. పాత్రికేయ సమాజ నిరసనలకూ కారణమైంది. ఫొటోగ్రాఫర్ శ్రీకృష్ణపై పిడిగుద్దులు గుద్దుతూ, కర్రలతో చితకబాదిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. దాదాపు అర కిలోమీటర్ వరకు కొట్టుకుంటూ తీసుకెళ్లారు. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. దెబ్బలతో సొమ్మసిల్లిన శ్రీకృష్ణను ఓ సీఐ ఎత్తుకుని తన వాహనంలోకి ఎక్కించారు. అతన్ని తమకు అప్పగించాలంటూ వైసీపీ శ్రేణులు వాహనానికి అడ్డుగా నిలబడ్డారు. సీఐపై కూడా దాడికి యత్నించారు. శ్రీకృష్ణ వద్ద ఉన్న కెమెరా, సెల్ ఫోన్, పర్సు అన్నీ లాక్కున్నారు. శ్రీకృష్ణపై జరగిన దాడి వీడియోను టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. వైసీపీ రౌడీ రాజకీయాలకు ఇది మరో నిదర్శనం అని ఆయన మండిపడ్డారు. సిద్ధం సభకు వస్తున్నది కార్యకర్తలా లేక గూండాలా అనే అనుమానం వస్తోందని అన్నారు.
అరాచక పాలనకు రోజులు దగ్గర పడ్డాయని పలువురు ఆ వీడియోను షేర్ చేస్తున్నారు. సిద్ధం దేనికంటూ అనంతపురంలో జరిగిన ఘటనపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఓవైపు దాడి జరుగుతుండగానే.. మరోవైపు జగన్ ప్రసంగం కొనసాగుతుండడం ప్రజల్లోనూ చర్చకు రేపుతోంది. అయితే సభా వేదికకు దూరంగా జరిగిన ఈ ఘటన ఆ సమయంలో జగన్ కు తెలియకపోవచ్చు.. అయితే ఆ తర్వాత కూడా దీనిపై స్పందించిన దాఖలాలు లేవు. అయితే.. ఈ సభే కాదు.. సిద్ధం సభలు చాలాచోట్ల రాద్దాంతానికి కారణం అయ్యాయి. పుట్టపర్తి ఎయిర్పోర్టు దగ్గర సీఎం జగన్ అలా అడుగుపెట్టారో లేదో.. ఎయిర్పోర్టు భవనమెక్కి మడకశిర రైతులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి మడకశిరకు హంద్రీనీవా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు నిరసన తెలియజేశారు. ప్లకార్డులతో ఆగలేదు.. ‘గో బ్యాక్ సీఎం.. డౌన్ డౌన్ సీఎం’.. ‘మాకొద్దు జగన్’.. ‘నీళ్లిచ్చి అనంతలో అడుగుపెట్టు’ అంటూ నినాదాలతో హోరెత్తించారు.
అనంతలో ఆర్టీసీ ప్రయాణికులు ‘సిద్ధం’ సభ కష్టాలు వచ్చి పడ్డాయి. రాప్తాడు సభకు సుమారు 3వేలకు పైగానే ఆర్టీసీ బస్సులను కేటాయించడం జరిగింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఎల్లో మీడియా ప్రచారం చేసింది. ఆఖరికి తిరుమల బస్సులను కూడా వదలకుండా రాప్తాడు సభకు తరలించారు వైసీపీ నేతలు. ‘సిద్ధం’ సభకు బస్సులను తరలించడంతో తిరుపతితో పాటు వివిధ బస్ స్టేషన్లలో బస్సుల కోసం గంటల తరబడి ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణీకుల పడిగాపులు కాసినట్లు వార్తలు వచ్చాయి. బస్సులు లేకపోవడంతో.. తిరుమల, పీలేరు, చిత్తూరు, కాణిపాకం, మదనపల్లి, నగరి, కడప ఇలా అన్ని రూట్లలోనూ బస్సులు లేక ప్రయాణీకుల అవస్థలు పడుతున్నారు. ఉన్న బస్సులన్నీ జగన్ సభకు బలవంతంగా జనాన్ని తరలించేందుకు ఉపయోగించడంతో బస్సులు లేకపోవడంతో.. జగన్పై పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఎక్కడ సిద్ధం సభ జరిగినా, సభకు జనం తరలించడం.. బస్సులు లేకపోవడం.. ఎక్కడికక్కడ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవడంతో పోలీసులు, అధికారుల తీరుపై చాలాచోట్ల విమర్శలు వ్యక్తం అయ్యాయి. మరోవైపు దగ్గరుండి జనాల్ని తరలించాలని వలంటీర్లకు హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చాయని ప్రచారం జరుగుతోంది. ఇంటి నుంచి కనీసం ఒకరైనా జగన్ సభకు రావాలని వాలంటీర్లు హుకుం జారీ చేశారట. ‘సిద్ధం’ సభలతో జనానికి సీఎం జగన్ నరకం చూపిస్తున్నారని టీడీపీ సోషల్ మీడియా విపరీతంగా ప్రచారం చేస్తోంది. సిద్ధం సభల ద్వారా జగన్మోహన్ రెడ్డి సర్కారు చేసిన అభివృద్దిని, చేపట్టిన సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటే.. మరోవైపు అక్కడక్కడ జరుగుతున్న దుర్ఘటనలతో సర్కారుకు చెడ్డపేరు తీసుకొస్తున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE